ఏప్రిల్, మే నెలల్లో 2 కోట్లకు పైగా ఉద్యోగాలు పోయాయ్, హౌస్ హోల్డ్స్ ఆదాయం డౌన్
దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏప్రిల్, మే నెలల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోయాయి. కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్ కారణంగా కొలువులపై ప్రభావం పడింది. గత కొద్ది నెలలుగా ఉద్యోగాలు తగ్గుతూ వస్తున్నాయి. ఒక్క మే నెలలోనే 1.5 కోట్లకు పైగా ఉద్యోగాలు గల్లంతయ్యాయి. ఈ మేరకు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(CMIE) డేటా ప్రకారం గత నెల 30వ తేదీతో ముగిసిన వారానికి అర్బన్ నిరుద్యోగిత రేటు ఏడాది గరిష్టస్థాయి 18 శాతానికి పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఇది 39.08 కోట్లుగా నమోదైన ఉద్యోగాలు, మే నెలలో 3.9 శాతం తగ్గి 37.55 కోట్లకు క్షీణించాయి.
బ్యాడ్-లాగా మార్చేసిన బీజేపీ, idea of GST: RIP: చిదంబరం 10 పాయింట్స్...
2.27 కోట్ల ఉద్యోగాలు పోయయి
2021 ఏప్రిల్, మే నెలల్లో దేశవ్యాప్తంగా 2.27 కోట్ల మంది ఉద్యోగాలు పోయాయని CMIE సీఈవో మహేష్ వ్యాస్ తెలిపారు. దేశంలో 40 కోట్ల మంది ఉద్యోగులున్నారని, ఇందులో 2.27 కోట్ల మంది గత 2 నెలల కాలంలో ఉద్యోగాలను కోల్పోయారని, ఇందుకు కరోనా పరిస్థితులే కారణమన్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అసంఘటిత రంగం కంటే సంఘటిత రంగం పైన ఎక్కువగా ఉందన్నారు.
లాక్డౌన్తో తక్షణ ప్రభావం అసంఘటిత రంగంపై పడిందని, అయితే సంఘటిత రంగాన్ని తదనంతర పరిణామాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయన్నారు. కరోనా సెకండ్ వేవ్, తర్వాత అసంఘటిత రంగంలోనివారికి దూరమైన ఉపాధి మళ్లీ లభిస్తోందని, కానీ ప్రయివేటు సంస్థల్లో పని చేస్తున్నవారు ఉద్యోగాలు కోల్పోతే తిరిగి రాని పరిస్థితి అన్నారు. ఒకవేళ దొరికినా అవి అర్హతకు తగిన ఉద్యోగాలు కావన్నారు. కొత్త కొలువులకు ఏడాది వరకు సమయం పడుతుందన్నారు.
నాలుగు నెలలుగా తగ్గుతున్నాయి
వరుసగా 4 నెలలుగా ఉద్యోగాలు తగ్గుతూ వస్తున్నాయని, ఏప్రిల్, మే నెలల్లో తగ్గుదల అధికంగా నమోదయిందని తెలిపారు. ఈ ఏడాది జనవరి నెలలో మొత్తం ఉద్యోగాల సంఖ్య 40.07 కోట్లు కాగా, అది మే చివరి నాటికి 37.55 కోట్లకు పడిపోయింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 2.53 కోట్ల మంది ఉద్యోగం కోల్పోవలసి వచ్చింది. గడిచిన 2 నెలల్లోనే 2.27 కోట్ల ఉద్యోగ నష్టం జరిగిందన్నారు.
హౌస్ హోల్డ్స్ ఆదాయం డౌన్
2020లో కరోనా ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు గృహస్తుల ఆదాయం ఏకంగా 97 శాతం క్షీణించిందని CMIE సర్వేలో వెల్లడైంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 1.75 లక్షల హౌస్ హోల్డ్స్ అభిప్రాయాలతో సర్వే నిర్వహించారు. ఇందులో 3 శాతం మంది మాత్రమే తమ ఆదాయం పెరిగిందని, 55 శాతం మంది క్షీణించిందని, 42 శాతం మంది ఏడాది క్రితం ఎలా ఉందో అలాగే ఉందన్నారు. ద్రవ్యోల్బణం ఆధారంగా 97 శాతం మంది ఆదాయాలు పడిపోయినట్లు తేల్చింది.