8 త్రైమాసికాల తర్వాత భారీ వృద్ధి, ఎందుకంటే: డబుల్ డిజిట్..
2020-21 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(జనవరి-మార్చి)లో భారత కంపెనీలు రెండంకెల వృద్ధిని నమోదు చేయవచ్చునని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. అంతకుముందు మందగమనం, గత ఏడాది కరోనా కారణంగా వరుసగా ఎనిమిది త్రైమాసికాలు వృద్ధి క్షీణించడమో లేదా సింగిల్ డిపాజిట్కు పరిమితం కావడమో జరిగిందని, కానీ జనవరి-మార్చి త్రైమాసికంలో వృద్ధి భారీగా పుంజుకొని 15 శాతం నుండి 17 శాతం నమోదు కావొచ్చునని పేర్కొంది. దీంతో కంపెనీల ఆదాయాలు రూ.6.9 లక్షల కోట్లుగా నమోదు కావొచ్చునని పేర్కొంది.
అందుకే వృద్ధి
నిర్వహణ లాభాల్లో 28 శాతం నుండి 30 శాతం వృద్ధి కనిపించవచ్చునని క్రిసిల్ అంచనా వేసింది. ఏడాది క్రితం ఇదే సమయంలో ఆదాయాలు బాగా పడిపోవడం (బేస్ ఎఫెక్ట్), కమొడిటీ ధరలు పెరగడం వంటి అంశాలు ఈసారి డబుల్ డిజిట్ లాభాలకు కారణాలుగా పేర్కొంది. 2020-21 రెండో అర్ధభాగంలో ఆదాయాలు పుంజుకున్నట్లు కనిపిస్తున్నాయని, కానీ 2019-20తో పోలిస్తే మొత్తం మీద ఆదాయాలు 50 బేసిస్ పాయింట్ల కంటే తక్కువగానే ఉండవచ్చునని పేర్కొంది. ఆర్థికసేవలు, చమురు కంపెనీలు మినహా మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్లో 55 శాతం నుండి 60 శాతం కలిగిన 300 కంపెనీలపై విశ్లేషణ ఆధారంగా అంచనాలను వెల్లడించింది.
ఎంత ఉండవచ్చునంటే
2020-21లో ఈ కంపెనీల మొత్తం ఆదాయం రూ.23.8 లక్షల కోట్లుగా నమోదు కావొచ్చునని అంచనా వేసింది. 2019-20తో పోలిస్తే ఇది 0.5 శాతం తక్కువ అని పేర్కొంది. అంతకుముందు త్రైమాసికాల్లో బేస్ ఎఫెక్ట్ తక్కువగా ఉడటం వంటి వివిధ అంశాలు డబుల్ డిజిట్ గ్రోత్కు కారణాలని క్రిసిల్ రీసెర్చ్ డైరెక్టర్ హెతాల్ గాంధీ అన్నారు.
ఏ రంగంలో ఏది ప్రభావం
సిమెంట్ రంగంలో ధరలు, అమ్మకాలు పుంజుకోవడం, విమానయానంలో ప్రయాణాలుతగ్గడం, మీడియా/వినోద రంగంలో ప్రకటన వ్యయాలు, చందాలు తగ్గడం, టెలికం సేవల్లో ఐయూసీ ఛార్జీల తొలగింపు, పెట్రో రసాయనాల రంగంలో ముడి చమురు, నాఫ్తా ధరలు పెరగడం, ఐటీ సేవల్లో డిజిటల్ డిమాండ్ వృద్ధి, రూపాయి క్షీణత, ఫార్మాపై అమ్మకాలు పెరగడం, వాహన రంగంలో అమ్మకాలు, ధరలు పెరగడం వంటి అంశాలు ప్రభావం చూపుతాయి.