నందన్ నీలేకనితో పని చేస్తాం, భారత్ నుంచి నేర్చుకుంటాం: బిల్ గేట్స్
న్యూఢిల్లీ/పాట్నా: రాబోయే దశాబ్దకాలంలో భారత్ చాలా వేగంగా ఆర్థిక అభివృద్ధి సాధిస్తుందని, అది కోట్లాదిమంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేస్తుందని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకలు బిల్ గేట్స్ అన్నారు. మన ఆర్థిక వ్యవస్థ మందగించి, డిమాండ్ తగ్గి, వినిమయం లేకుండా, పెట్టుబడులు వెనక్కి వెళ్లి, పరిశ్రమల వృద్ధి కుంటుపడినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో బిల్ గేట్స్ మాత్రం భారత్ శరవేగంగా వృద్ధి సాధిస్తుందని, ఆ సత్తా ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థలో మెరుగైన వృద్ధి రేటు నమోదు కావడం వల్ల అనేకమంది ప్రజలు పేదరికం నుంచి బయటపడతారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున విద్య, వైద్యం కోసం పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
ఏపీకి జగన్ గుడ్న్యూస్: ఆరోగ్యశ్రీకి అర్హతలు ఇవే.. కారు, ఇల్లు, ఆదాయం...
కోట్లాదిమంది పేదరికం నుంచి బయటపడతారు
మిలిందా గేట్స్ ఫౌండేషన్కు సంబంధించిన పనుల పర్యవేక్షణలో భాగంగా మూడు రోజులపాటు భారత్ పర్యటనకు వచ్చారు బిల్ గేట్స్. ఈ సందర్భంగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితి గురించి తనకు అవగాహన లేదని, కానీ రాబోయే దశాబ్ద కాలంలో భారత్ చాలా వృద్ధి సాధిస్తుందని చెప్పారు. కోట్లాదిమంది పేదరికం నుంచి బయటపడతారన్నారు. దీంతో ప్రభుత్వం, విద్య, వైద్యంవంటి రంగాలపై మరింత ఖర్చు చేస్తుందన్నారు.
ఆధార్, యూపీఐ చెల్లింపులు భేష్
ఆధార్ గుర్తింపు, యూపీఐ చెల్లింపు వ్యవస్థలపై బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. ప్రజలు ఆధార్, యూపీఐ చెల్లింపులను ఎంతో ఆదరిస్తున్నారని, వాటి పని తీరు నుంచి గొప్ప పాఠాలను నేర్చుకోవచ్చునని చెప్పారు. ఆర్థిక సర్వీస్లు, ఫార్మా రంగంలో భారత్ పనితీరు బాగుందని చెప్పారు.
నందన్ నీలేకనితో కలుస్తాం
ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని వంటి వ్యక్తులతో తాము భాగస్వామ్యం కావాలనుకుంటున్నట్లు చెప్పారు. తద్వారా డిజిటల్ గుర్తింపులు, ఆర్థిక సేవల వంటి రంగాల్లో ఇతర దేశాలు భారత్ నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చుననే దానిపై దృష్టి సారిస్తామన్నారు.
వ్యాక్సీన్ల తయారీలో భారత్ అగ్రగామి...
వ్యాక్సీన్ల తయారీలో భారత్ అగ్రగామిగా... మార్గదర్శకంగా ఉందని బిల్ గేట్స్ అన్నారు. ప్రజల జీవితాల్ని మెరుగుపరిచే విషయంలో భారత్ ప్రభావవంతమైన సహకారం అందిస్తోందని చెప్పారు. భారత్ గురించి ఆలోచించినప్పుడు చాలా మంది ఐటీ సర్వీసుల గురించి మాట్లాడతారని, కానీ తక్కువగా కనిపిస్తూ ఎక్కువ ప్రభావితం చేసే వ్యాక్సిన్ తయారీదారులు ఇండియాలో ఎక్కువ అన్నారు. సెరమ్తోపాటు భారత్ బయోటెక్, బయోలాజికల్-ఈ వంటి వివిధ కంపెనీలు వ్యాక్సిన్ల తయారీతో ప్రజల ఆరోగ్యాలను మెరుగుపరుస్తున్నాయన్నారు.
గేట్స్ ఫౌండేషన్
దేశంలో చవకగా ఆరోగ్య సంరక్షణ సేవలు అందించేందుకు ప్రయివేటు రంగ ఇన్నోవేషన్స్తో పాటు టెక్నాలజీ వంటి డిజిటల్ సాధనాల వినియోగం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఆరోగ్యం, వ్యవసాయ రంగాలకు సంబంధించి కొన్ని ప్రయివేటు కంపెనీలను కలిసి కొత్త ఇన్నోవేషన్స్ గురించి తెలుసుకుంటున్నట్లు చెప్పారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ హెల్త్ కేర్, పారిశుద్ధ్యం, వ్యవసాయం, ఆర్థిక సేవల రంగంలో పేదరికంగా వెనుకబడిన వర్గాల కోసం కృషి చేస్తోందని బిల్ గేట్స్ చెప్పారు. ఈ ఫౌండేషన్ కోసం బిల్ గేట్స్ 3,500 కోట్ల డాలర్లు ఇచ్చారు.