Air India నిండా మునిగినట్టే: 1.2 బిలియన్ డాలర్లు చెల్లించక తప్పదా
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన పౌర విమానయాన సంస్థ ఎయిరిండియా.. చిక్కుల్లో చిక్కుకుంది. న్యాయపరమైన వివాదాల్లో నిండా మునిగింది. బ్రిటన్కు చెందిన పారిశ్రామిక దిగ్గజ సంస్థ కెయిర్న్ ఎనర్జీ.. ఎయిరిండియాపై పిటీషన్ వేసింది. 1.2 బిలియన్ డాలర్లకు చెందిన పిటీషన్ అది. అమెరికా న్యాయస్థానంలో ఈ మేరకు ఈ కేసును దాఖలు చేసింది. గత ఏడాది డిసెంబర్లో ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను ఎయిరిండియా ధిక్కరించినట్లు పేర్కొంది. బ్రిటన్ అనుసరిస్తోన్న పెట్టుబడుల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం ఉల్లంఘించిందని స్పష్టం చేసింది.
అమెరికా కాలమానం ప్రకారం.. శుక్రవారం ఉదయం సదరన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ న్యూయార్క్ను కెయిర్న్ ఎనర్జీ యాజమాన్యం ఆశ్రయించింది. దీనికి సంబంధించిన పిటీషన్లను దాఖలు చేసింది. ఈ వివాదంలో కెయిర్న్ ఎనర్జీ వాదనలు నెగ్గితే.. ఎయిరిండియా నెత్తిన పిడుగు పడినట్టే. ఇప్పటికే నష్టాలను చవి చూస్తూ, ప్రైవేటీకరణను ఎదుర్కొంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎయిరిండియా 1.2 బిలియన్ డాలర్లను చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొనడం మరింత ఇబ్బందుల్లోకి నెట్టినట్టవుతుంది. ఎయిరిండియా తరఫున కేంద్ర ప్రభుత్వం.. 1.2 బిలియన్ డాలర్లు ప్లస్ వడ్డీతో సహా ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పునకు లోబడి మరింత మొత్తాన్ని జమ కట్టాల్సి ఉంటుంది.
కెయిర్న్ ఎనర్జీ దాఖలు చేసిన ఈ పిటీషన్పై ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. దీనిపై మరిన్ని వివరాలను సేకరించాల్సి ఉందని తెలిపింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులు కూడా మౌనం దాల్చారు. ఎయిరిండియాపై కెయిర్న్ ఎనర్జీ ఆర్థికపరమైన పిటీషన్ను న్యాయస్థానాల్లో దాఖలు చేయడం ఇది రెండోసారి. మధ్యవర్తిత్వాన్ని తమకు అప్పగించాలంటూ ఇదివరకు ఫిబ్రవరిలో ఓ కేసును దాఖలు చేసింది. మధ్యవర్తిత్వానికి సంబంధించి 2014 నుంచి ఉన్న ఇంటరెస్ట్ను చెల్లించాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిందా సంస్థ. తాజాగా మరోసారి కోర్టుకెక్కింది.