India GDP Data: జీడీపీ గణాంకాలపై అందరిలోను ఆసక్తి
గత ఆర్థిక సంవత్సరం(FY21) భారత జీడీపీ గణాంకాలు నేడు (సోమవారం) వెలువడే అవకాశాలున్నాయి. FY21 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే కఠిన లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతం నుండి 8 శాతం ఎకానమీ క్షీణత నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే చివరి త్రైమాసికంలో మాత్రం రెండు శాతం వరకు వృద్ధి అంచనాలు నమోదయ్యే అవకాశముంది.
కఠిన లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మైనస్23.9 శాతం, రెండో త్రైమాసికంలో మైనస్ 7.3 శాతం క్షీణత నమోదయింది. అయితే లాక్డౌన్ ఆంక్షలు తొలగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి పుంజుకోవడంతో మూడో త్రైమాసికంలో 0.4 శాతం స్వల్ప వృద్ధి నమోదయింది. నాలుగో త్రైమాసికంలో 2 శాతం ఉండవచ్చునని అంచనాలు ఉన్నాయి.
జీడీపీ గణాంకాలు.. సూచీలు పైకి
భారత జీడీపీ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ అప్రమత్తంగా ప్రారంభమయ్యాయి. నేడు ఉదయం స్తబ్దుగా ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం సమయానికి 430 పాయింట్ల భారీ లాభాల్లోకి వెళ్లింది. అంతర్జాతీయ, ఆసియా మార్కెట్లు సానుకూలంగా ఉండటం, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం జీడీపీ గణాంకాలు కాస్త సానుకూలంగా ఉంటాయనే వార్తల నేపథ్యంలో సూచీలు పైపైకి కదులుతున్నాయి.
ఆర్థిక వ్యవస్థపై అంత ప్రభావం ఉండదు
భారత ఆర్థిక వ్యవస్థపై గత ఆర్థిక సంవత్సరం ఉన్నంత ప్రభావం ఈసారి ఉండదని రేటింగ్ ఏజెన్సీలు చెబుతున్నాయి. కరోనా అప్పుడే వెలుగు చూడటంతో ప్రజల్లో అవగాహన లేకుండా పోయింది. దీంతో దేశ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు దాదాపు మూడు నెలల సంక్లిష్ట లాక్ డౌన్ అమలు చేశారు. దీంతో భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. అయితే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అంతగా ప్రభావం ఉండకపోవచ్చునని భావిస్తున్నారు.
3 ట్రిలియన్ డాలర్ల మార్కెట్
ఇండియన్ ఎకానమీ, క్యాపిటల్ మార్కెట్కు 3 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఓ మైల్ స్టోన్. భారత్ 1 ట్రిలియన్ డాలర్ల మైల్ స్టోన్ చేరడానికి 60 సంవత్సరాలు పట్టింది. 2007 మే నెలలో 1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్కు చేరుకుంది. ఆ తర్వాత పదేళ్లకు అంటే 2017లో 2 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. 2021లో 3 ట్రిలియన్ డాలర్లను తాకింది.