భారీ ఆర్థిక విపత్తు.. ప్రధాని ఆఫీస్ ఒక్కటే చేయలేదు, అమెరికా వలె మనకు సాధ్యం కాదు: రాజన్
కరోనా మహమ్మారి వల్ల భారత్ అతిపెద్ద ఆర్థిక విపత్తును ఎదుర్కొంటోందని, ప్రధానమంత్రి కార్యాలయం ఒక్కటే దీనిని నిర్వహించలేదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. ఇండియా ఎదుర్కోబోయే విపత్తు గురించి ఆందోళనగా ఉందని, ప్రభుత్వం ప్రతిపక్ష సలహాలు కూడా ఈ సమయంలో తీసుకోవాలని, ఇవన్నీ పీఎం ఒంటి చేత్తో చేయలేరన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో చేయాలని లేదంటే నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ది వైర్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఆదాయపు పన్ను తగ్గింపు లేదు, ప్యాకేజీలో డబ్బులు చేతికి ఎందుకివ్వలేదంటే?: నిర్మల
అది కీలకం..
కరోనా వల్ల దేశం పెనుసంక్షోభాన్ని ఎదుర్కోనుందని, ముప్పు పొంచి ఉన్నందున దేశంలోని నిపుణులను సంప్రదించి సూచనలు, సలహాలు తీసుకోవాలని రాజన్ అన్నారు. కరోనా వల్ల కలిగిన నష్టాన్ని భర్తీ చేయడం ఒక్కటే కాదని, మూడు నాలుగేళ్ల కిందటి ఆర్థిక వైభవం అందుకోవడం కీలకమన్నారు. అంత మేర నష్టం జరిగిందని అభిప్రాయపడ్డారు. దేశంలో చాలామంది ప్రతిభావంతులు ఉన్నారని, ప్రభుత్వం వారి సూచనలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు చూడవద్దని, కలిసి పని చేయాలన్నారు. యశ్వంత్ సిన్హా, చిదంబరం వంటి పేర్లను ప్రస్తావిస్తార అంటే ఆయన పేర్లు కాకుండా నైపుణ్యం కలిగిన వారు ఉన్నారని చెప్పారు.
అందరం కలిస్తే గట్టెక్కుతాం
మనం ఎదుర్కొంటున్న విపత్తు ముదురుతోందని రాజన్ అన్నారు. ప్రతిపక్షాలు, నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవడం తప్పనిసరి అన్నారు. దేశంలో ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయన్నారు. అందరూ కలిస్తే ఈ వైరస్ సృష్టించిన విపత్తుకు పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశంలో ఎందరో మేధావులు ఉన్నారని, వారందరికీ పిలుపునివ్వాల్సిన అవసరం ఉందని సూచించారు. అందరు కలిస్తే ఈ కష్టకాలం నుండి గట్టెక్కగలమని చెప్పారు.
రేటింగ్ గురించి ఆలోచించవద్దు
కరోనా వల్ల ఏర్పడిన నష్టంతో పోలిస్తే రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ సరిపోదని చెప్పారు రఘురాం రాజన్. కష్టాల్లో ఉన్న రంగాలను ఆదుకునేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే ఏడాదిలోగా ఆర్థిక వ్యవస్థ మరింత భారీగా నష్టపోయే పోయే ప్రమాదముందన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం మౌలిక ప్రాజెక్టులు, నిర్మాణ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ద్రవ్యలోటు పెరిగి, అంతర్జాతీయ పరపతి రేటింగ్ సంస్థలు దేశపరపతి రేటింగ్ను తగ్గిస్తాయనే ఆందోళనలు వదిలేయాలన్నారు.
అమెరికా వలె ప్యాకేజీ మనకు సాధ్యం కాదు
కష్టాల్లో ఉన్న ఎయిర్లైన్స్, పర్యాటకరంగా, కారు మ్యానుఫ్యాక్చరింగ్, నిర్మాణ రంగాలు కుప్పకూలాయని రఘురాం రాజన్ అన్నారు. అయితే ఈ రంగాలను ఆదుకునేందుకు అమెరికాలో వలె ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం భారత్లో సాధ్యం కాదన్నారు. బక్కచిక్కిన ఈ సంస్థలను ఆదుకునేందుకు రుణ పునర్ వ్యవస్థీకరణతో పాటు, మూల ధన సాయం కూడా అవసరం కావొచ్చునని చెప్పారు. విమానయాన సంస్థలకు డెబిట్ రిలీఫ్ ఇవ్వాలన్నారు.
నగదు సాయం అవసరం
మైగ్రేంట్ వర్కర్లకు కూరగాయలు, వంటనూనె, షెల్టర్కు మనీ ఇవ్వడం అవసరమని రఘురాం రాజన్ చెప్పారు. రేషన్ ఒక్కటి ఇస్తే సరిపోదన్నారు. అంటే చేతికి ఉచిత నగదు కొద్దిగా ఇవ్వాలన్నారు. లాక్ డౌన్ కారణంగా వీరికి ఉపాధి కరువైందన్నారు.