చైనా దూకుడుపై భారత్ ధైర్యం... సూపర్: 59 యాప్స్ నిషేధంపై నిక్కీ హేలీ ప్రశంస
సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యల కారణంగా భారత్ 59 చైనీస్ యాప్స్ను బ్యాన్ చేయడం, రహదారుల నిర్మాణంలో చైనా కంపెనీలను దూరం పెట్టడం వంటి కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్ నిర్ణయాన్ని అమెరికా సహా పలు దేశాలు స్వాగతిస్తున్నాయి. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. జపాన్, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాలు భారత్కు మద్దతుగా మాట్లాడుతున్నాయి.
భారత ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పు: చైనా-భారత్ ఉద్రిక్తతలపై చాంగ్
చైనా దూకుడుకు తగ్గని భారత్.. భేష్
చైనా దూకుడుకు ధీటుగా భారత్ ముందుకు సాగుతోందని అమెరికా అభిప్రాయ పడింది. చైనా వ్యవహార ధోరణిపై భారత్ వెనుకడుగు వేయడం లేదని ఇండో అమెరికన్, రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ ప్రశంసించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. భారత్ను అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా పరిగణించే టిక్టాక్తో సహా చైనా సంస్థలకు చెందిన 59 యాప్స్ను నిషేధించడం చాలా మంచి నిర్ణయం అన్నారు. ఇందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. చైనా దూకుడుపై భారత్ వెనుకడుగు వేయకుండా నిలిచిందని కితాబిచ్చారు.
వారి జాతి భద్రత కోసమే..
అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో కూడా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆధీనంలో నడుస్తున్న మొబైల్ యాప్స్ను భారత్ నిషేధించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. తద్వారా భారత సార్వభౌమాధికారం, సమగ్రత పెరుగుతుందని, అది వారి జాతి భద్రతకు ఉపయోగకరమన్నారు.
శాంతి కోరుకుంటాం కానీ..
చైనా యాప్స్ను నిషేధించడం డిజిటల్ స్ట్రైక్గా పేర్కొన్నారు కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్. భారతీయుల డేటాను కాపాడటం కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. భారత్ దేశం శాంతిని కోరుకుంటుందని, కానీ మా వైపు ఎవరైనా చూస్తే మాత్రం తగిన విధంగా సమాధానం చెప్పేందుకు వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టిక్ టాక్ యూజర్లలో భారత్ వాటా 30 శాతం వరకు ఉంటుంది. దీని మాతృసంస్థ బైట్ డ్యాన్స్ భారత్లో 1 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్తో 2019 నుండి ఉద్యోగులను నియమించుకుంటోంది.