ఇప్పటికైనా కళ్ళు తెరిచారు... చైనాకు కళ్లెం వేయాల్సిందే.. లేకుంటే అంతే!
ప్రపంచంలో కేవలం కొన్ని దేశాలు మాత్రమే ఆ దేశంలో ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియనీయకుండా జాగ్రత్త పడతాయి. అందులో చైనా అగ్ర భాగాన నిలుస్తుంది. ప్రపంచం వాడే ఏ సాఫ్ట్ వేర్ లు (ఒక్క మైక్రోసాఫ్ట్ తప్ప) ఆ దేశం వినియోగించదు. ఏ సామజిక పోర్టల్ ను అనుమతించదు. పత్రికలూ, మీడియా కూడా ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయి. ప్రభుత్వానికి ఇష్టమైన అంశాలు తప్ప... మిగితా ఎలాంటి విషయాలు కూడా బయటి సమాజానికి తెలిసే అవకాశమే ఉండదు. చైనా మిత్ర దేశం ఉత్తర కొరియా కూడా అంతే.
ఇలాంటి ప్రపంచంలో వేళ్ళ మీద లెక్క పెట్టగలిగే దేశాలు మాత్రమే అత్యంత గోప్యత పాటిస్తాయి. తద్వారా తమకు కావాల్సిన పనులను చక్కబెట్టుకుంటాయి. చైనా రహస్య వ్యవహార శైలి ఇటీవల కరోనా వైరస్ తో మరోసారి బయట పడింది. చైనా లోని వుహాన్ నగరంలో మొదలైన కరోనా వైరస్... ఆ దేశాన్ని దాటుకొని వచ్చి ప్రపంచంలోని 200 దేశాలను చుట్టేసింది. సుమారు 130 దేశాలు కరోనా వైరస్ తీవ్రతతో సతమతమవుతున్నాయి. కానీ, చైనా మాత్రం ఆ వైరస్ వ్యాప్తికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రపంచంతో పంచుకునేందుకు ఇష్టపడటం లేదు. మరణాలు, కేసులను కూడా దాస్తోంది. కరోనా ను పూర్తిగా కట్టడి చేసినట్లు ప్రవర్తిస్తోంది. కానీ, ప్రపంచానికి ఆ రహస్యమేదో మాత్రం చెప్పటం లేదు.
వ్యూహాం మార్చిన మాంసం వ్యాపారులు! రెండింతలు పెరిగిన ఆర్డర్లు
అవకాశవాది ...
ఈ పదం వాడేందుకు కొంత ఇబ్బందికరంగా అనిపించినా... చైనా వ్యవహారశైలి మాత్రం దీనికి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే... ప్రస్తుతం భారత్ సహా ప్రపంచ దేశాలు కరోనా వైరస్ బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతుంటే... చైనా మాత్రం ఇదే అదునుగా ఇండియా సహా ప్రపంచంలోని విలువైన కంపెనీల్లో తక్కువ ధరకే వాటాలు చేజిక్కించుకునే పనిలో పడింది. కరోనా దెబ్బకు ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుదేలు అయిన విషయం తెలిసిందే. మన స్టాక్ మార్కెట్లు కూడా భారీగా పతనం అయ్యాయి. దీంతో మన దేశంలోని గొప్ప కంపెనీల షేర్లు కూడా పతనమయ్యాయి. ఇదే అదునుగా చైనా పావులు కదపటం ప్రారంభించింది. దొడ్డి దారిన అత్యంత ఆకర్షణీయమైన హెచ్ డీ ఎఫ్ సి బ్యాంకు లో 1 శాతం షేర్లను కొనుగోలు చేసేసింది. మరిన్ని కంపెనీలపై కన్నేసింది. ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.
పసిగట్టిన పరిశ్రమలు...
చైనా అవకాశవాద ధోరణని ప్రబుత్వానికంటే ముందే పరిశ్రమలు గుర్తించాయి. పలు పరిశ్రమల సంఘాలు ఈ సమాచారాన్ని నేరుగా ప్రభుత్వానికి అందజేశాయి. అలాగే ప్రభుత్వాన్ని వేడుకున్నాయి కూడా. ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రభుత్వం ఈ విషయంలో కలుగజేసుకోకపోతే ... కొన్ని రోజుల్లోనే ప్రధాన కంపెనీలు అన్నీ కూడా చైనా కంపెనీల చేతికి వెళ్ళిపోతాయని హెచ్చరించాయి. దీంతో కళ్ళు తెరిచిన కేంద్ర ప్రభుత్వం ఆగమేఘాల పై విదేశి ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను మార్చివేసింది. ముఖ్యంగా భారత్ తో సరిహద్దులు పంచుకునే దేశాలు ప్రభుత్వ అనుమతి లేకుండా ఎటువంటి పెట్టుబడులు చేయరాదని సవరించిన నిబంధనల్లో పేర్కొంది. ఈ నిర్ణయంతో మన దేశ కంపెనీలు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ విషయంలో కాస్త ఆలస్యం జరిగినా... పరిస్థితి చేయి దాటి పోయేదే. మెజారిటీ ఇండియన్ కంపెనీలు చైనా చేతికి చిక్కి విలవిలలాడేవే.
దోస్తీ పోరుతో దోపిడీ...
కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చైనా తో దోస్తీ ఎక్కువైంది. అటు నుంచి చైనా అధ్యకుడు షీ జిన్ పింగ్ కూడా నరేంద్ర మోడీ తో ఫ్రెండ్షిప్ కొనసాగిస్తున్నారు. కానీ, గత ఆరేళ్లలో చాప కింద నీరులా ఇండియా లోని చాలా రంగాలు చైనా గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు మొత్తం చైనా కంపెనీల తయారీవే. రెడ్ మీ, రియల్ మీ, వన్ ప్లస్, వివో, ఒప్పో, హానర్, మోటో ఇలా అన్ని ఫోన్లు చైనా దేశానికి చెందిన కంపెనీలవే. మన దేశంలో విక్రయమయ్యే మొత్తం స్మార్ట్ ఫోన్లలో సుమారు 65% వాటా ఈ కంపెనీలవే. ఈ దెబ్బకు మన కంపెనీలు మైక్రో మాక్స్, సెల్ కాన్, లావా వంటివి బాగా దెబ్బతిన్నాయి. ఇక ఎలక్ట్రానిక్స్ రంగంలోనూ అదే జోరు చూపిస్తోంది చైనా. ఇంకా టిక్ టాక్, జూమ్ వంటి ఆప్ లతో మన దేశ పౌరులకు సంబంధించిన సమస్త సమాచారాన్ని సేకరిస్తోంది చైనా. ఈ డేటా ను ఆ దేశం రేపు ఎలా వినియోగిస్తుందో ఎవరికీ తెలియదు. మనం మాత్రం పెద్ద ప్రమాదంలో ఉన్నామన్నది నిజం.
పేటీఎం, జొమాటో, బిగ్ బాస్కెట్ పై పెత్తనం...
పేరుకే పేటీఎం, జొమాటో, బిగ్ బాస్కెట్ వంటి కంపెనీలు మనవి. కానీ, వాటిలో మెజారిటీ వాటా మాత్రం చైనా కు చెందిన అలీబాబా గ్రూప్ దే. దేశంలో ఈ మూడు సంస్థలే తీసుకుంటే కనీసం 50 కోట్ల మంది ప్రత్యక్షంగా వీటి సేవలను తమ రోజు వారీ కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నారు. కానీ, వాటి యాజమాన్యం మాత్రం చైనా గుప్పిట్లోకి వెళ్లిపోతుండటం గమనార్హం. ఈ మొబైల్ యాప్ లలో మనం మన అత్యంత రహస్యమైన సమాచారాన్ని కూడా ఇచ్చేస్తున్నాం. బ్యాంకు అకౌంట్లతో అనుసంధానిస్తున్నాం. ఇది ఎంత వరకు శ్రేయస్కరమో ఆలోచించాలి. ఇప్పుడు కొన్ని రంగాలు, కంపెనీలకే పరిమితమైన చైనా ఆధిపత్యం... పగ్గాలు లేకపోతే అన్ని రంగాలకు విస్తరించటం ఖాయం. అప్పుడు మన దేశం ఒకప్పటి బ్రిటిష్ పాలనలోకి వెళ్లిన పరిస్థితులు మళ్ళీ వచ్చినా ఆశ్చర్యపోవద్దు. సో, చైనా తో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మన దేశానికి... మన ప్రజలకు కూడా. మీరేమంటారు?