ధరల పెరుగుదల తాత్కాలికమే: ప్రధాన్, పెట్రోల్ పన్ను తగ్గింపుపై ఠాకూర్ ఏమన్నారంటే
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్ర పెట్రోలియం, నేచరల్ గ్యాస్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రధాన్ చమురు ధరల పెరుగుదల తాత్కాలికమే అన్నారు. పెట్రోల్, డీజిల ధరల పెరుగుదల తాత్కాలికమేనని, క్రమంగా వాటి ధరలు తగ్గుముఖం పడతాయని ANI వార్తాసంస్థ ఇంటర్వ్యూలో అన్నారు. 'అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా మన దేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ఇది తాత్కాలికమే. క్రమంగా తగ్గుముఖం పడతాయి. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని చమురు ఉత్పాదక దేశాలతో చర్చిస్తున్నా'మని తెలిపారు.
ధరల పెరుగుదలపై కేంద్రమంత్రులు
కరోనాతో దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజపరుచడానికి విధించిన పన్నులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయ వనరులుగా ఉంటాయని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఇంతకుముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పెట్రోలియం ఉత్పత్తుల పెరుగుదలపై స్పందించారు.
పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదల అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుకోవాల్సిన అంశమని, వీటి తగ్గింపుకు సమన్వయంతో చర్చించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంతోపాటు రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్పై పన్ను విధిస్తున్నాయని గుర్తు చేశారు. ఇంధన ధరలు తగ్గాల్సి ఉందని నిర్మలమ్మ అభిప్రాయపడ్డారు.
పెరుగుతున్న ధరలు
గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ధరల పెరుగుదల నేపథ్యంలో వినియోగం తగ్గుముఖం పట్టింది. సెప్టెంబర్ తర్వాత మొదటిసారి పెట్రోల్, డీజిల్ వినియోగం 5 శాతం తగ్గింది. డీజిల్ వినియోగం 8.5 శాతం, గ్యాసోలైన్ వినియోగం 6.5 శాతం మేర తగ్గింది. గత నెలలో గ్యాసోలైన్, డీజిల్ ధరలు రికార్డ్ గరిష్టాన్ని తాకాయి. ధరల పెరుగుదల ప్రభావం వినియోగంపై పడింది.
జీఎస్టీ పరిధిలోకి తేవడంపై అనురాగ్ ఠాకూర్
పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై మరో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా వేరుగా స్పందించారు. ఈ అంశానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు లోకసభలో ఆయన ప్రతిపక్షాల ప్రశ్నకు సమాధానం చెప్పారు. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చే అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించేందుకు తాము సిద్ధమని ఠాకూర్ అన్నారు. పన్ను తగ్గింపు అంశంపై ఇరు ప్రభుత్వాలు చర్చించాలన్నారు.