ITR filing deadline: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదా.. జనవరి 10 వరకు గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలు చేయలేదా? మరొక్క రోజు మాత్రమే మిగిలి ఉందని ఆందోళన చెందుతున్నారా? అయితే కేంద్ర ప్రభుత్వం కాస్త ఊరట ఇచ్చింది. కరోనా మహమ్మారి కారణంగా ఇదివరకు పలుమార్లు ఐటీ రిటర్న్స్ గడువును పొడిగించారు. డిసెంబర్ 31, 2020 వరకు క్రితంసారి అవకాశం ఇచ్చారు. మరోసారి పొడిగింపు ఉండదని ఇటీవల సంకేతాలు ఇచ్చారు. అయితే అనేక విజ్ఞప్తుల నేపథ్యంలో ఒకసారి పొడిగింపు అవకాశమిచ్చారు. అలాగే, మరో పొడిగింపు ఉండదనే సంకేతాలు ఇచ్చారు.
ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ... చైనా మొబైల్స్దే హవా: ఎక్కువగా కొనుగోలు చేసింది ఇవే
తాజాగా, జనవరి 10, 2021 వరకు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు సమయం ఇచ్చింది కేంద్రం. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ను జనవరి 10వ తేదీ వరకు పొడిగించడం ద్వారా మరో పది రోజుల పాటు వెసులుబాటు కల్పించింది. అలాగే, కంపెనీల ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును 15 రోజులు పెంచింది. ఫిబ్రవరి 15వ తేదీలోపు రిటర్న్స్ దాఖలు చేసుకునే వెసులుబాటు కల్పించింది.
కాగా, డిసెంబర్ 28వ తేదీవరకు 4.54 కోట్ల మంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినట్లు ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది. వివాద్ సే విశ్వాస్ గడువును జనవరి 31వ తేదీ వరకు పొడిగించింది.