రోజుకు రూ.84 లక్షలు ఖర్చు చేస్తే వారి సంపద కరిగిపోవడానికి 84 ఏళ్లు!
2021 క్యాలెండర్ ఏడాదిలో 84 శాతం మంది హౌస్ గోల్డ్స్ ఆదాయం తగ్గింది. కరోనా కారణంగా రెండేళ్లుగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. రెండేళ్లుగా కొనసాగుతున్న ఈ మహమ్మారి కారణంగా చాలామంది ఆర్థికంగా దెబ్బతిన్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చాలామంది ఆదాయం తగ్గింది. అదే సమయంలో కుబేరుల సంపద మాత్రం భారీగా పెరిగింది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అసమానతలు మరింత పెరుగుతున్నాయని పేదరిక నిర్మూలన కోసం పని చేస్తున్న ఈ ఆక్స్ఫామ్ నివేదిక స్పష్టం చేసింది. ఈ దుస్థితికి కరోనా మరింత ఆజ్యం పోసిందని వెల్లడించింది.
102 నుండి 142కు పెరిగిన కుబేరులు
భారతదేశంలో 2020తో పోలిస్తే 2021లో బిలియనీర్ల సంపద రెండింతలు పెరిగిందని, కుబేరుల సంఖ్య కూడా ఏడాది క్రితంతో పోలిస్తే 39 శాతం పెరిగిందని తెలిపింది. ఈనిక్వాలిటీ కిల్స్ పేరిట ఈ ఏడాది ఆర్థిక అసమానతలపై ఆక్స్ఫామ్ తన నివేదికను సోమవారం విడుదల చేసింది.
కరోనా కారణంగా జీవనాధారం దెబ్బతిని దేశంలోని 84 శాతం కుటుంబాల ఆధాయం తగ్గిందని, అదే సమయంలో బిలియనీర్ల సంఖ్య 102 నుండి 142కు పెరిగినట్లు తెలిపింది. దేశ సంపదలో 45 శాతం తొలి పదిమంది ధనవంతుల వద్ద ఉందని, అట్టడుగున ఉన్న 50 శాతం మంది వద్ద ఆరు శాతం సంపద మాత్రమే ఉందని తెలిపింది.
పాతికేళ్లు ఉచిత చదువు
దేశంలోని కుబేరుల జాబితాలో మొదటి వంద స్థానాల్లో ఉన్న వ్యక్తుల సంపద వ్యాల్యూ 2021లో రూ.57.3 లక్షల కోట్లకు చేరుకుంది. దేశంలోని తొలి పదిమంది ధనవంతుల సంపదతో దేశంలోని పిల్లలందరికీ ప్రాథమిక, ఉన్నతస్థాయి విద్యను పాతికేళ్లు ఉచితంగా అందించవచ్చు. అత్యంత ధనవంతులైన మొదటి 98 మంది సంపద, అట్టడుగు 40 శాతంతో ఉన్న 55.5 కోట్లమంది పేద ప్రజల సంపదతో సమానమని తెలిపింది.
తొలి 10 మంది సంపదతో...
తొలి పదిమంది ధనవంతులు ప్రతిరోజు రూ.10 లక్షలు ఖర్చు చేస్తే వారి సంపద మొత్తం కరిగిపోవడానికి 84 ఏళ్లు పడుతుందని ఆక్స్ఫామ్ తెలిపింది. దేశంలోని బిలియనీర్లు, మల్టీ మిలియనీర్లపై ఒక శాతం వెల్త్ ట్యాక్స్ విధిస్తే ప్రతి సంవత్సరం 78.3 బిలియన్ డాలర్లు వసూలు అవుతాయి. దీంతో దేశంలో ఏ ఒక్కరూ వైద్యం కోసం తమ జేబు నుండి ఖర్చు చేయవలసిన అవసరం రాదు.
అంతేకాకుండా 30.5 బిలియన్ డాలర్ల మిగులు ఉంటుంది. మొదటి 98 కుబేరుల సంపదపై నాలుగు శాతం పన్ను విధిస్తే వచ్చే డబ్బుతో అంగన్వాడీ సేవలు, పోషణ్ అభియాన్, కిశోర బాలికల కోసం తెచ్చిన పథకాలు కలిగిన మిషన్ పోషణ్ 2.0 పథకాన్ని పదేళ్లు నిర్వహించవచ్చు. దేశంలో ఇప్పటికీ 93 శాతం మంది అసంఘటిత రంగంలో పని చేస్తున్నారు. వీరి సామాజిక భద్రత కోసం తెచ్చిన పథకాలకు అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.5 శాతం కోత విధించారు.