'వినిమయం, పెట్టుబడులే పెద్ద సవాల్, ప్రభుత్వ ఆదాయం తగ్గితే కష్టమే'
ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆర్థిక మందగమన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సంస్కరణలు చేయాల్సి ఉందని, కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని, పీఎస్బీల పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ కావాల్సి ఉందని, కార్పోరేట్ గవర్నెన్స్ పెరగాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. దేశీయ కంపెనీలు, PSBల నిర్వహణ సామర్థ్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ITR మిస్ అయ్యారా? వారమే గడువు.. ఆ తర్వాత రూ.5,000 ఎక్కువ ఫైన్
వినమయం, పెట్టుబడులు పెద్ద సవాల్
మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి అవకాశాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలంటే కంపెనీలు, బ్యాంకుల నిర్వహణ సామర్థ్యం పెరగడం తప్పనిసరి అని శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. వినిమయం, పెట్టుబడులు మన ముందున్న అతి పెద్ద సవాళ్లు అన్నారు. మన ఆర్థిక వ్యవస్థను పరుగు పెట్టించే రెండు వృద్ధి ఇంజిన్లు ఇవే అన్నారు. ఈ రెండు కూడా నెమ్మదించాయని, వీటిని గాడిలో పెట్టాలన్నారు. ఇది పెద్ద సవాలే అన్నారు.
ఇది ఊరట కలిగించే అంశం
ప్రభుత్వ ఆదాయం తగ్గి, కీలక ఆర్థిక లక్ష్యాలపై ప్రభావం పడుతుందని కూడా ఆర్బీఐ హెచ్చరించింది. లక్ష్యాల కంటే పన్ను ఆదాయాలు తగ్గుతుండటం, ప్రయివేటు వినియోగం బలహీనంగా ఉండటంతో కొత్త పెట్టుబడులు సవాలేనని, అదే సమయంలో బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగు కావడం, 2019 మార్చితో సమానంగా సెప్టెంబర్ చివరి వరకు ఎన్పీఏలు 9.3 శాతమే ఉండటం ఊరట కలిగించే అంశమని పేర్కొన్నారు.
కేవలం ఆదాయపు పన్ను మాత్రమే పెరిగింది.
ద్రవ్యలోటు నవంబర్ నాటికే బడ్జెట్ అంచనాను మించి 107 శాతానికి చేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 3.3 శాతానికి పరిమితం చేయాలని ప్రభుత్వ లక్ష్యం ఎంత వరకు సఫలమవుతుందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు గమనార్హం. జీఎస్టీ ఆదాయం 14 శాతం పెరుగుతుందని అంచనా వేయగా అది 2.5 శాతానికే పరిమితమైంది. కార్పోరేట్ పన్ను తగ్గింపు వల్ల రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి గండిపడింది. పెట్టుబడుల ఉపసంహరణ వల్ల రూ.1.05 లక్షల కోట్ల వస్తాయని భావించగా 17 శాతమే వచ్చాయి. ఆదాయపు పన్ను మాత్రం గత ఏడాది కంటే పెరిగింది. గత ఏడాది రూ.24,000 కోట్లు కాగా ఇప్పుడు రూ.33,000 కోట్లుగా ఉంది.