బ్యాంకింగ్ స్టాక్స్ అదరగొట్టాయి: ICICI, యాక్సిస్ బ్యాంకు షేర్ పరుగులు
బ్యాంకింగ్ రంగ స్టాక్స్ నేడు(అక్టోబర్ 25, సోమవారం) అదరగొట్టాయి. ప్రయివేటురంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు శనివారం 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో త్రైమాసికం ఫలితాలను విడుదల చేసింది. ఫలితాల అనంతరం ఈ స్టాక్ పరుగులు పెడుతోంది. ICICI బ్యాంకు షేర్ ఏకంగా 52 వారాల గరిష్టాన్ని తాకింది. స్టాక్ మధ్యాహ్నం గం.3 సమయానికి 10.65 శాతం లాభపడి రూ.840 వద్ద ట్రేడ్ అయింది. అంతకుముందు ఓ సమయంలో రూ.859 సరికొత్త గరిష్టాన్ని తాకింది. రెండు రోజుల క్రితం విడుదలైన త్రైమాసిక ఫలితాల్లో ఈ బ్యాంకు నెట్ ప్రాఫిట్ 30 శాతం పెరిగింది. నేటి స్టాక్ పరుగుకు ఇది దోహదపడింది.
జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి ఐసీఐసీఐ బ్యాంకు అద్భుతమైన ఫలితాలు ప్రకటించింది. దీంతో నేటి ట్రేడింగ్లో ఓ దశలో14 శాతానికి పైగా ఎగబాకింది. ఎన్ఎస్ఈలో రూ.867 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఐసీఐసీఐ మార్కెట్ వ్యాల్యూ రూ.6 లక్షలకు చేరువైంది. రికార్డుస్థాయి లాభాలతో పాటు నిరర్థక ఆస్తులు తగ్గడంతో ఇన్వెస్టర్ల విశ్వాసం, ఉత్సాహం పెరిగింది. ఐసీఐసీఐ బ్యాంకు స్టాండలోన్ పద్ధతిలో ఈసారి అత్యధిక త్రైమాసిక లాభాన్ని ప్రకటించింది.
అన్ని విభాగాల్లో రుణాల వృద్ధికి తోడు ఎన్పీఏలు తగ్గాయి. నికరంగా రూ.5,511 కోట్ల లాభాలను నమోదు చేసింది. 2020-21 ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.4,251 కోట్లుగా మాత్రమే నమోదయింది. మొత్తం ఆదాయం రూ.23,651 కోట్ల నుండి రూ.26,031 కోట్లకు పెరిగింది. ఏకీకృత ప్రాతిపదికన కూడా బ్యాంకు రూ.6,092 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంకుకు ఒక త్రైమాసికంలో ఇదే అత్యధిక లాభం.
2020-21 ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.4,882 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.39,289.60 కోట్ల నుండి స్పల్పంగా పెరిగి రూ.39,484.50 కోట్లకు చేరుకుంది. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 5.17 శాతం నుండి 4.82 శాతానికి, నికర నిరర్థక ఆస్తులు 1 శాతం నుంచి 0.99 శాతానికి మెరుగయ్యాయి.
ఐసీఐసీఐ బ్యాంకుతో పాటు ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు షేర్లు కూడా నేడు 52 వారాల గరిష్టాన్ని తాకాయి. ఎస్బీఐ షేర్ ధర నేడు మధ్యాహ్నం గం.3కు 0.40 శాతం లాభపడి రూ.505 వద్ద ట్రేడ్ అయింది. నేడు రూ.515 వద్ద గరిష్టాన్ని తాకింది. యాక్సిస్ బ్యాంకు షేర్ ధర కూడా 3.45 శాతం లాభపడి రూ.844.85 వద్ద ట్రేడ్ అయింది. నేడు ఓ స్థాయిలో రూ.867 సమీపానికి చేరుకుంది.