ఉద్యోగులకు కరోనా వ్యాక్సినేషన్ ఖర్చు భరిస్తాం: ICICI ప్రకటన
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినైజేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. దశలవారీగా వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. అయితే దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగుల కరోనా వ్యాక్సినేషన్ ఖర్చును భరించేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల వ్యాక్సినైజేషన్ ఖర్చును భరించేందుకు ముందుకు వచ్చింది. తాజాగా ప్రయివేటురంగ దిగ్గజం ICICI బ్యాంకు కూడా అదే బాటలో నడుస్తోంది.
ఉద్యోగుల వ్యాక్సినేషన్ ఖర్చును తామే భరించనున్నామని ICICI ప్రకటించింది. దాదాపు లక్షమంది వరకు ఉద్యోగులు ఉండగా, వారితో పాటు వారి కుటుంబ సభ్యుల వ్యాక్సిన్ ఖర్చును భరించనున్నట్లు తెలిపింది. ఉద్యోగులు, వారిపై ఆధారపడే కుటుంబసభ్యుల రక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కరోనా నుండి రక్షణ పొందడానికి తీసుకోవాల్సిన రెండు టీకాల ఖర్చు మొత్తాన్ని తాము ఉద్యోగులకు రీయింబర్స్ చేస్తామని తెలిపింది.
కరోనా వంటి క్లిష్ట సమయంలో లక్షలమంది కస్టమర్లకు తమ ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులకు ఓర్చి సేవలు అందించారని పేర్కొంది. అలాంటి వారికి, వారి కుటుంబానికి ఇలా సహకరించడం తమ బాధ్యత అని పేర్కొంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, టీవీఎస్ మోటార్స్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్, ఐసీఐసీఐ తదితర సంస్థలు ఉద్యోగుల వ్యాక్సినేషన్ ఖర్చును భరిస్తున్నాయి.