IBM: రెండు ఉద్యోగాలకు ఐబీఎం 'NO'.. భారత్ కేంద్రంగా IBM మెగా ప్లాన్.. మాంద్యంలోనూ ముందుకు..!
IBM: భారతీయ ఐటీ సేవల రంగం రోజురోజుకు అభివృద్ధి చెందుతున్నప్పటికీ, ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ప్రమాదం అగ్రదేశాలను తీవ్రంగా ప్రభావితం చేయబోతోంది. దీంతో ఐటీ పరిశ్రమపై ప్రభావం పడుతుందా అనే ప్రశ్న లక్షల మంది ఐటీ ఉద్యోగులకు నిద్రలేకుండా చేస్తోంది. ఇలాంటి సమయంలో.. ప్రపంచంలోనే అతిపెద్ద, పురాతన టెక్ సేవల సంస్థ ఐబీఎం ఓ ముఖ్యమైన విషయాన్ని వెల్లడించింది. అందేంటంటే..
భారత్ కేంద్రంగా IBM..
నాయకత్వం, వ్యాపార వ్యూహం, ప్రాధాన్యతలో మార్పుతో IBM ఇప్పుడు తిరిగి వృద్ధి ట్రాక్లోకి వచ్చింది. గతంలో కంపెనీ రాబడిలో క్షీణతను ఎదుర్కొనటంతో కొంత వెనుకబడింది. కంపెనీ ప్రపంచ వ్యాప్త వ్యాపారానికి భారతదేశం, ఇక్కడి ఉద్యోగులు కేంద్ర బిందువు. భారత్ నుంచి ప్రపంచానికి సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేస్తున్నట్లు IBM తెలిపింది. భారత్లో చేస్తున్న పని కేవలం భారతదేశానికే కాదు ప్రపంచానికి కూడా ఉపయోగపడుతుందని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టామ్ రోసామిలియా అన్నారు.
మూన్లైటింగ్పై సంచలన వ్యాఖ్యలు..
ప్రస్తుతం ప్రపంచంలోని ఐటీ కంపెనీలన్నీ తమ ఉద్యోగుల వ్యవహారశైలి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై దేశీయ టెక్ దిగ్గజాలైన విప్రో, ఇన్ఫోసిస్ సీరియస్ గా ఉన్నాయి. తమ ఉద్యోగులకు హెచ్చరికలు సైతం చేశాయి. అయితే తాజాగా ఐబీఎం ఇండియా సైతం దీనిని సమర్థించింది. మూన్లైటింగ్ అనైతికమని IBM ఇండియా, దక్షిణాసియా విభాగం ఎండీ సందీప్ పటేల్ అన్నారు.
160 దేశాల్లో కార్యకలాపాలు..
న్యూయార్క్ కేంద్రంగా ఐబీఎం ప్రస్తుతం దాదాపు 160 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అలా సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టిన దేశాల్లో భారత్ ఒకటి. ప్రస్తుతం మన దేశంలోని ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, భువనేశ్వర్, కోయంబత్తూర్, గుర్గావ్, హైదరాబాద్, పూణే, మైసూర్, కొచ్చిలలో కంపెనీకి ల్యాబ్లతో పాటు కార్యాలయాలు కూడా ఉన్నాయి. దేశంలో కంపెనీ ప్రస్తుతం లక్ష మందికి ఉపాధి కల్పించింది.
మాంద్యం భయాలు..
మాంద్యం భయాలు అంతటా అలుముకున్న నేపథ్యంలో భారతదేశంలోని టెక్ కంపెనీలు ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకోవచ్చని తెలుస్తోంది. అవి ఖర్చులను నియంత్రించడంతో పాటు లాభాలను తిరిగి అందుకుంటాయని నిపుణులు అంటున్నారు. అయితే సంక్షోభం తారా స్థాయికి చేరినప్పుడు కొంత తొలగింపులు ఉండే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఐబీఎం మాత్రమే కాక ప్రపంచంలోని అనేక టెక్ కంపెనీలు భారత్ లో కార్యాలయాలను ఏర్పాటు చేసి ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే.