జనవరి నుంచి పెరగనున్న హ్యుండాయ్ ధరలు, హీరో బైక్స్ రూ.2,000 ప్రియం
న్యూఢిల్లీ: జనవరి 2020 నుంచి తమ మొత్తం వాహణ శ్రేణి ధరలు పెంచుతున్నట్లు హ్యుండాయ్ మోటార్ ఇండియా ప్రకటించింది. వివిధ మోడల్స్, ఇంధన ధరల రకాలను బట్టి ధరల పెంపు ఉంటుందని స్పష్టం చేసింది. మోడల్ వారీగా ధరల పెంపు వివరాలను కంపెనీ వెల్లడించాల్సి ఉంది. పెరిగిన ముడి వస్తువుల భారం కారణంగా ధరలు పెంచుతోంది.
మళ్లీ తగ్గిన వాహనాల అమ్మకాలు, ఉత్పత్తి పెరిగింది: మనమే బెట్టర్, చైనాది మరీ దారుణం
హ్యుండాయ్ అన్ని మోడల్స్ కార్ల ధరల పెంపుపై పని చేస్తున్నామని, పూర్తి వివరాలను ఈ నెల చివరలో ప్రకటిస్తామని తెలిపింది. జనవరి నుంచి ధరలు పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ గత వారం ప్రకటించిన విషయం తెలిసిందే. టయోటా, మహీంద్రా, మెర్సిడెజ్ బెంజ్ కూడా పెంపు సంకేతాలు ఇచ్చాయి.
మరోవైపు, హీరో మోటాకార్ప్ మోడల్స్ పైన రూ.2,000 వరకు ధరలు పెంచింది. బైక్స్ తయారీలో అగ్రగామి అయిన ఈ సంస్థ మోటార్ సైకిల్స్, స్కూటర్ల ధరలను రూ.2వేల వరకు పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. అన్ని రకాల టూవీలర్స్ ధరలకు ఈ పెంపు వర్తిస్తుందని, వివిధ మోడళ్లను బట్టి ధరల పెంపులో తేడాలుంటాయని తెలిపింది. ప్రస్తుతం సంస్థ రూ.39,900 నుంచి రూ.1.05లక్షల లోపు విలువైన స్కూటర్స్, మోటార్ సైకిల్స్ దేశవ్యాప్తంగా విక్రయిస్తోంది.