పెట్రోల్ ధరలు తగ్గించాలంటే..: నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
పెట్రోల్, డీజిల్ ధరలు ఇటీవల భారీగా పెరుగుతున్నాయి. కరోనా కాలంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు చాలాచోట్ల సెంచరీ దాటాయి. లీటర్ పెట్రోల్ పైన రెండేళ్లలో రూ.34కు పైన, లీటర్ డీజిల్ పైన రూ.30 పెరిగింది. ఈ రెండేళ్ల కాలంలో డొమెస్టిక్ పెట్రోల్ ధరలు 32 శాతం, డీజిల్ 46 శాతం పెరిగింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ATF) కంటే ఇప్పుడు పెట్రోల్ 35 శాతం ఎక్కువగా ఉంది. ఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలో లీటర్కు రూ.79,020 కాగా, లీటర్ పెట్రోల్ మాత్రం రూ.107 పైన ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ అంశంపై కీలక వ్యాక్యలు చేశారు.
పెట్రోల్, డీజిల్పై ఆధారపడకుండా
పెట్రోల్, డీజిల్ పైన ఆధారపడటాన్ని తగ్గించాలని, దీనికి ప్రత్యామ్నాయం హైడ్రోజన్ అన్నారు. ఈ ప్రత్యామ్నాయం ధరల పెరుగుదలకు బ్రేక్ వేయవచ్చునని అభిప్రాయపడ్డారు. హైడ్రోజన్ ఆధారిత ఫ్యూయల్ వినియోగం పెట్రోల్, డీజిల్ కంటే ప్రయోజకరమన్నారు. దిగుమతి చేసుకుంటోన్న పెట్రోల్, డీజిల్ పైన దేశం ఆధారపడటాన్ని తగ్గించాలని భావిస్తున్నామని, అంతేకాదు, ఫ్యూయల్ను ఎగుమతి చేయాలన్నారు. గ్రీన్ హైడ్రోజెన్ మంచి ప్రత్యామ్నాయమని చెప్పారు. అప్పుడు ట్రాన్సుపోర్ట్ రంగంలో భారీ మార్పులు వస్తాయన్నారు.
ఆ దేశాలకు సాయం
ఖరీదైన ఇంధన దిగుమతులపై ఆధారపడిన భారత్ ఉగ్రవాదానికి ఆర్థిక సాయం చేసే దేశాలను సంపన్న దేశాలుగా మారుస్తోందని గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే గడ్కరీ ఏ దేశాన్ని పేర్కొనలేదు. కానీ పెట్రోల్, డీజిల్ దిగుమతిని తగ్గించడం ద్వారా దేశంలోని చాలా సమస్యలను పరిష్కరించవచ్చునని చెప్పారు.
దేశంలో ఇప్పటికి 20 రాష్ట్రాలు వ్యక్తిగత ఈవీ విధానాలతో ఎలక్ట్రిక్ వాహనాలను పుష్ చేస్తున్నాయి. కేంద్రం పెట్రోల్, డీజిల్కు ప్రత్యామ్నాయాన్ని పరిశీలిస్తూనే ఉంది. ఈ దశాబ్దం చివరి నాటికి పది వాహనాల్లో కనీసం నాలుగు శిలాజరహిత ఇంధనంతో నడపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. సీఎన్జీతో పాటు వాహన యజమానులు ఆ దిశగా ముందుకు సాగుతున్నారు.
ఫ్లెక్స్ ఇంజిన్ విధానం
ప్రజలపై పెట్రో భారాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం త్వరలో ఫ్లెక్స్ ఇంజిన్ విధానాన్ని తీసుకు రానుందని నితిన్ గడ్కరీ చెప్పారు. ఫ్లెక్స్ ఇంజిన్లతో పెట్రోల్ లేదా ఇథెనాల్ను వాహనాల్లో వినియోగించవచ్చన్నారు. ఇథెనాల్ తక్కువ ధరలో లభించడమే కాకుండా కాలుష్యాన్ని తగ్గిస్తుందని తెలిపారు.
ఇథెనాల్ ఆధారిత ఫ్లెక్స్ ఇంజిన్ వినియోగం ద్వారా పెట్రోల్ అవసరం తగ్గుతుందని, ప్రజలకు ఇంధన ధరల నుండి ఉపశమనం లభిస్తుందన్నారు. బ్రెజిల్, కెనడా, అమెరికా తదితర దేశాల్లో వాహనాలు పెట్రోల్తో పాటు బయో ఇథెనాల్తో నడుస్తాయని గుర్తు చేశారు. భారత్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 పైన ఉందని, ఇథెనాల్ ధర రూ.65 మాత్రమే అన్నారు. పెట్రోల్ కంటే ఇథెనాల్ ఎన్నో రెట్లు ఉత్తమమని చెప్పారు.
అందుకే ఫ్లెక్స్ ఇంజిన్ అవసరమని, వీటితో వాహనాల్లో పెట్రోల్ లేదా ఇథెనాల్ను వినియోగించవచ్చునని చెప్పారు. అదనంగా ఒక ఫిల్టర్ మాత్రమే అవసరమని, లీటర్ ఇథెనాల్ ద్వారా కనీసం రూ.25 ఆదా చేసుకోవచ్చునన్నారు. రైతులకు కూడా ప్రయోజనం అన్నారు.