శుభవార్త: హైదరాబాద్ - బెంగళూరు ఆర్టీసీలో ఛార్జీలు తగ్గాయి, కానీ...
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కొత్త ప్రయోగాలు చేస్తోంది. ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ కార్గో, పార్సిల్ సేవలు విస్తృతపరిచేందుకు సిద్ధమైంది. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా జరిగే సరకు రవాణాను ఇక నుంచి ఆర్టీసీ కార్గో, పార్సిల్ సర్వీస్ ద్వారా చేయనుంది. అలాగే, మరో ప్రయోగం కూడా చేస్తోంది. డిమాండ్ లేని రోజుల్లో గరుడ ప్లస్ ఛార్జీలను తగ్గించింది.
ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త, రిటైర్మెంట్ వయస్సు పెంపు
బెంగళూరు నుంచి హైదరాబాద్, అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు మార్గంలో నడిచే బస్సుల్లో డిమాండ్ లేని రోజుల్లో గరుడ ప్లస్లో తగ్గింపు విధానాన్ని బుధవారం నుంచి అమలు చేస్తోంది. ఈ మార్గంలో నడిచే బస్సుల్లో 32 వరకు టీఎస్ఆర్టీసీ, 25 వరకు కర్ణాటక రాష్ట్రానివి ఉన్నాయి. మరో ముప్పై నుంచి 40 వరకు ప్రయివేటు ఆపరేటర్లు నిర్వహిస్తున్నారు.
ప్రతి వారంలో శుక్రవారం, ఆదివారం డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువమంది సాఫ్టువేర్ ఇంజినీర్లు ఉండటంతో శుక్రవారం సాయంత్రం బెంగళూరు నుంచి హైదరాబాదుకు వస్తారు. అదే విధంగా ఆదివారం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తారు. మిగతా రోజుల్లో డిమాండ్ తక్కువగా ఉంటుంది.
తెలంగాణ ఆర్టీసీలో హైదరాబాద్ - బెంగళూరు మధ్య గరుడ ప్లస్ ఛార్జీ రూ.1,300గా ఉంది. ప్రయివేటు బస్సుల్లో, కర్ణాటక ఆర్టీసీలో ఈ ఛార్జీ కంటే తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రయివేటు బస్సుల్లో డిమాండ్ ఆధారంగా చార్జీల్లో తెలంగాణ ఆర్టీసీ మార్పులు చేసింది. శుక్రవారం బెంగళూరు నుంచి హైదరాబాదుకు ఛార్జీ రూ.1,300. ఆదివారం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రూ.1300 ఛార్జ్. సాధారణ రోజుల్లో ఇది రూ.950గా ఉంటుంది.