హైదరాబాద్వాసులకు గుడ్న్యూస్: మెట్రో రైల్లో QR కోడ్ టిక్కెట్
హైదరాబాద్: భాగ్యనగరంవాసులకు శుభవార్త. మెట్రో ఎక్కాలంటే టిక్కెట్ కొనుగోలు చేసేందుకు కౌంటర్ల వద్ద వేచి ఉండాలి. మొదట్లో కౌంటర్ల వద్ద టిక్కెట్ కొనడం సులభంగానే ఉంది. కానీ ఇటీవల మెట్రోకు రద్దీ పెరుగుతోంది. దీంతో టిక్కెట్ కొనాలంటే లైన్ కట్టాల్సిన పరిస్థితి వస్తోంది. టిక్కెట్ కౌంటర్ల వద్ద ప్రయాణీకులు కొన్ని సందర్భాలలో బారులు తీరుతున్నారు.

QR సౌకర్యం
మెట్రో రైలు కోసం ఇప్పటి వరకు స్మార్ట్ కార్డ్ లేదా టోకెన్ కౌంటర్లో టిక్కెట్ కొనుగోలు చేసి ప్రయాణించే సౌకర్యం ఉంది. కౌంటర్ల వద్ద క్యూ పద్ధతిని తగ్గించడం, ప్రయాణీకులకు మరింత మెరుగైన సౌకర్యాలను కల్పించడం.. వంటి లక్ష్యాలతో మెట్రో ఇక నుంచి QR టిక్కెట్ సౌకర్యాన్ని కల్పించనుంది. దీంతో ఆన్లైన్ ద్వారా టిక్కెట్ బుక్ చేసేందుకు అవకాశం కల్పిస్తుంది.

స్మార్ట్ కార్డు
కొత్తగా ప్రవేశ పెట్టనున్న ఈ విధానం హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లో ప్రారంభిస్తారు. ప్రస్తుతం మెట్రో రైలు ప్రయాణీకుల్లో మూడొంతుల మందికి పైగా స్మార్ట్ కార్డును వినియోగిస్తున్నారు. మిగతా వారు కౌంటర్లలో కొనుగోలు చేస్తున్నారు. టిక్కెట్ కౌంటర్ల వద్ద క్యూలైన్ తగ్గించేందుకు QR కోడ్ను తీసుకు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు
స్మార్ట్ ఫోన్ ద్వారా ఆన్లైన్లోనే టిక్కెట్ కొనుగోలు చేయవచ్చు. ఆ తర్వాత QR కోడ్ రూపంలో టిక్కెట్ మొబైల్లో కనిపిస్తుంది. దానిని ఎంట్రీ గేట్ వద్ద చూపించి లోపలకు వెళ్లవచ్చు. ఆర్టీసీ సమ్మె సమయంలో చాలామంది మెట్రోను ఉపయోగించారు. బస్సులు ప్రారంభమైన తర్వాత కూడా మెట్రోకు ప్రయాణీకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. QR కోడ్ బేస్డ్ యాప్ను ఎల్ అండ్ టీ రూపొందించింది.


Click it and Unblock the Notifications