Hurun Rich List: తెలుగు రాష్ట్రాల్లో రూ.1000 కోట్ల సంపద వీరిదే, హైదరాబాద్ వారే అధికం
iifl వెల్త్ హూరున్ ఇండియా రిచ్ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి 69 మంది చోటు దక్కించుకున్నారు. దేశవ్యాప్తంగా రూ.1,000 కోట్ల కంటే పైన సంపద కలిగిన వారి జాబితాను రూపొందించగా, ఇందులో తెలుగు రాష్ట్రాల నుండి 69 మంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుండి చోటు దక్కించుకున్న వీరి సంపద మొత్తం రూ.3,79,200 కోట్లుగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే వీరి సంపద 54 శాతం పెరిగింది. వీరిలో దివిస్ లేబోరేటరీస్ అధినేత మురళీ దివి, ఆయన కుటుంబానికి చెందిన ఆస్తులు రూ.79,000 కోట్లు. వీరు మొదటి స్థానంలో ఉన్నారు.
రూ.26,100 కోట్లతో హెటెరో డ్రగ్స్ అధినేత పార్థసారథి రెడ్డి, ఆయన కుటుంబం ఆస్తులు రూ.26స100గా ఉన్నాయి. రూ.7,700 కోట్లతో బయోలాజికల్ ఈ-లిమిటెడ్కు చెందిన మహిమా దాట్ల తెలుగు రాష్ట్రాల్లో మహిళా కుబేరుల్లో మొదటి స్థానంలో ఉన్నారు. రానున్న అయిదేళ్లలో iifl వెల్త్ హూరున్ ఇండియా రిచ్ జాబితాలో దాదాపు 200 మంది చోటు దక్కించుకోవచ్చునని, వచ్చే పదేళ్లలో భారత్ నుండి చాలామంది బిలియనీర్లుగా ఎదిగే అవకాశముందని హూరున్ ఇండియా ఎండీ అన్నారు.
హైదరాబాద్ నుండి 56 మంది
iifl వెల్త్ హూరున్ ఇండియా రిచ్ జాబితాలోని 69 మందిలో కేవలం హైదరాబాద్ నుండే 56 మంది ఉన్నారు. రంగారెడ్డి జిల్లా నుండి నలుగురు, విశాఖపట్నం నుండి ముగ్గురు ఉన్నారు. అంటే 81 శాతం మంది కుబేరులు హైదరాబాద్ నుండి ఉన్నారు. జాబితాలో చోటు దక్కించుకున్న వారు 13 మంది ఉన్నారు.
వీరి సంపద వ్యాల్యూ రూ.49,500 కోట్లు. ఇందులో తొలి రెండు స్థానాల్లో రూ.12,000 కోట్లతో GAR కార్పోరేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ జీ అమరేందర్ రెడ్డి, రూ.9,700 కోట్లతో సువెన్ ఫార్మాకు చెందిన వెంకటేశ్వర్లు జాస్తి ఉన్నారు. వీరు తెలుగు రాష్ట్రాల టాప్ 10 జాబితాలోను ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి గత ఏడాది 9 మంది బిలియనీర్లు ఉండగా, ఆ సంఖ్య ఇప్పుడు 15కు పెరిగింది.
ఫార్మా రంగం నుండి అధికం
iifl వెల్త్ హూరున్ ఇండియా రిచ్ జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో ఎక్కువగా ఫార్మా రంగానికి చెందిన వారు ఉన్నారు. ఈ రంగం నుండి 21 మంది ఉండగా, ఫుడ్ ప్రాసెసింగ్ రంగం నుండి ఏడుగురు, కన్స్ట్రక్షన్ అండ్ ఇంజినీరింగ్ రంగం నుండి ఆరుగురు, కెమికల్స్ అండ్ పెట్రో కెమికల్స్ రంగం నుండి ఐదుగురు, సాఫ్టువేర్ అండ్ సర్వీసెస్ నుండి నలుగురు, రియాల్టీ రంగం నుండి నలుగురు ఉన్నారు.
అంటే ఫార్మా రంగం 30 శాతం, ఫుడ్ ప్రాసెసింగ్ నుండి 10 శాతం, కన్స్ట్రక్షన్ అండ్ ఇంజినీరింగ్ రంగం నుండి 9 శాతం మంది ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అత్యధికంగా సింఘానియా ఫుడ్స్ ఇంటర్నేషనల్ కంపెనీకి చెందిన ముగ్గురు (రూ.5100 కోట్లు), విర్కో లేబోరేటరీస్కు చెందిన ముగ్గురికి (రూ.4400 కోట్లు) ఈ జాబితాలో చోటు దక్కింది.
టాప్ కుబేరులు
తెలుగువారి నుండి టాప్ టెన్లో దివిస్ ల్యాబ్స్ మురళీ దివి రూ.79,000 కోట్లతో మొదటి స్థానంలో, హెటిరో ల్యాబ్స్ అధినేత పార్థసారథి రెడ్డి రూ.26,100 కోట్లతో రెండో స్థానంలో, మేఘా ఇంజినీరింగ్ అధినేతలు పీ పిచ్చిరెడ్డి, పీవీ కృష్ణారెడ్డిలు రూ.23,400 కోట్లతో మూడో స్థానంలో, రూ.12,300 కోట్లతో డాక్టర్ రెడ్డీస్ అధినేత కె సతీష్ రెడ్డి 4వ స్థానంలో, రూ.12,000 కోట్లతో GARకు చెందిన అమరేందర్ రెడ్డి 5వ స్థానంలో, ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అధినేత సత్యనారాయణ రెడ్డి రూ.11,500 కోట్లతో ఆరవ స్థానంలో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అధినేత జీవీ ప్రసాద్ రూ.10,300 కోట్లతో ఎనిమిదో స్థానంలో, రూ.9700 కోట్లతో సువెన్ ఫార్మా అధినేత వెంకటేశ్వర్లు జాస్తి 8వ స్థానంలో, గ్లాండ్ ఫార్మా అధినేత పీవీఎన్ రాజు రూ.9300 కోట్లతో తొమ్మిదో స్థానంలో, నాట్కో ఫార్మా అధినేత వీసీ నన్నపనేని రూ.9100 కోట్లతో 10వ స్థానంలో నిలిచారు.
తెలుగు రాష్ట్రాల నుండి కొత్తగా జాబితాలో చోటు దక్కిన వారిలో టాప్ 5.. GARకు చెందిన అమరేందర్ రెడ్డి (రూ.12,000 కోట్లు), సువెన్ ఫార్మాస్యూటికల్స్ అధినేత వెంకటేశ్వర్లు జాస్తి(రూ.9700 కోట్లు), బాలాజీ అమైన్స్ అధినేత ప్రతాప్ రెడ్డి(రూ.7500 కోట్లు), తాన్లా ప్లాట్ఫామ్స్ అధినేత దాసరి ఉదయ్ కుమార్ రెడ్డి (రూ.4700 కోట్లు), గ్రీన్ కో గ్రూప్ చీఫ్ అనిల్ కుమార్ చలమశెట్టి (రూ.3800 కోట్లు) ఉన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కుబేర మహిళగా బయోలాజికల్ ఈ-లిమిటెడ్ ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాట్ల (రూ.7700 కోట్లు) నిలిచారు. ఆల్ ఇండియా IIFL వెల్త్ హూరున్ ఇండియా రిచ్ జాబితాలో 231 స్థానం దక్కించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 15వ స్థానంలో ఉన్నారు. 69 మందిలో మరో తెలుగు మహిళ లక్ష్మీరాజు చోటు దక్కించుకున్నారు. NACL ఇండస్ట్రీస్కు చెందిన లక్ష్మీరాజు సంపద రూ.1000 కోట్లు. భారత్ బయోటెక్కు చెందిన క్రిష్ణ ఎల్లా, కుటుంబం తెలుగు రాష్ట్రాల్లో 22వ స్థానంలో నిలిచారు. దేశవ్యాప్తంగా 377వ స్థానంలో ఉన్నారు. వీరి సంపద రూ.4100 కోట్లు.