పీఎం-కేర్స్ ఫండ్, రాష్ట్రాలకు రూ.7 కోట్లు ఇచ్చిన చైనా కంపెనీ
దేశంలో కరోనా మహమ్మారిపై పోరాడేందుకు ప్రభుత్వం పీఎం-కేర్స్ ఫండ్ను ఏర్పాటు చేసింది. దీనికి పారిశ్రామికవేత్తలు, ప్రజలు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్, విప్రో ఇలా ఎన్నో సంస్థలు వందల కోట్లు అందించాయి. ఈ జాబితాలో చైనీస్ కంపెనీలు కూడా ఉన్నాయి. టిక్టాక్ వంటి సంస్థలు రూ.30 కోట్లు ఇచ్చాయి. చైనీస్ టెలికం దిగ్గజం హువావే కూడా భారీ విరాళం ఇచ్చింది.
ప్లీజ్.. చైనా కంపెనీవి చూపించొద్దు: రిటైలర్స్కు షాక్, ఆ దెబ్బతో 'మేడిన్ ఇండియా లోగో'
పీఎం కేర్స్, ఆరు రాష్ట్రాలకు రూ.7 కోట్లు
చైనాకు చెందిన హువావే... పీఎం కేర్స్ ఫండ్, మరో ఆరు రాష్ట్రాలకు కరోనాపై పోరు కోసం రూ.7 కోట్ల విరాళం ఇచ్చింది. కరోనాపై పోరుకు రిమోట్ టెంపరేచర్ మానిటరింగ్ వంటి సాంకేతిక పరిష్కారాలను భారత్తో పంచుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. హువావే ఇండియా సీఈవో జే చెన్ మాట్లాడుతూ.. కరోనాపై పోరుకు చైనా అనుభవాలను, సాంకేతికతను భారత్ దేశంలో ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితిని ఎదుర్కొనేందుకు సహకరిస్తామని తెలిపారు.
ప్రభుత్వానికి సహకరిస్తాం
చైనాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కదిలే ఆబ్జెక్టివ్ ఉష్ణోగ్రతను రియల్ టైంలో 5జీ ప్లస్ థెర్మల్ ఇమేజింగ్ ద్వారా గుర్తించవచ్చునని తెలిపారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చైనాలో ఈ టెక్నాలజీని ఉపయోగించారన్నారు. ఈ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడానికి హువావే ఇండియా కూడా తమ సామాజిక బాధ్యతగా ప్రభుత్వానికి సహకరిస్తుందని తెలిపారు. ప్రభుత్వంతో పాటు పరిశ్రమ తదితరులతో కలిసి పని చేస్తున్నామన్నారు.
వందల కోట్లు..
పీఎం కేర్స్ ఫండ్కు రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.500 కోట్లు ఇచ్చింది. భారతీ ఎంటర్ ప్రైజెస్ రూ.100 కోట్లు ప్రకటించింది. సన్ ఫార్మా కూడా రూ.100 కోట్లు ఇచ్చింది. కరోనాపై పోరుకు టాటా గ్రూప్ రూ.1500 కోట్లు, విప్రో రూ.1200 కోట్లు ప్రకటించింది. ఇందులో పీఎం కేర్స్ ఫండ్తో పాటు వివిధ రూపాల్లో ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించారు.