ఆ కంపెనీలకు చైనా ఆర్మీ తో సంబంధాలు... త్వరలో చర్యలు?
ఇండియా - చైనా ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. గత ఆరేళ్లుగా స్నేహ గీతాన్ని ఆలపించిన ఇరు దేశాలు ఒక్క సంఘటనతో మళ్ళీ బద్ద శత్రువులుగా మారిపోయాయి. ఇటీవల గాల్వాన్ లోయలో జరిగిన పరిణామాల తర్వాత ఇండియా - చైనా లు వేటికవే సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. గూఢచర్యానికి పాల్పడుతున్నాయని, లేదా మన దేశ భద్రతకు ముప్పు కలిగించే అవకాశాలు ఉన్నాయని భావించి చైనా కు చెందిన 59 మొబైల్ ఆప్ లను ఇండియా నిషేధించింది.
ఇందులో టిక్ టాక్ వంటి బహుళ ప్రాచుర్యం పొందిన మొబైల్ ఆప్ లు కూడా ఉండటం విశేషం. ఈ ఊహించని దెబ్బకు చైనా కొంత తత్తరపాటుకు గురైంది. సుమారు రూ 1 లక్ష కోట్లకు పైగా చైనా కంపెనీల ఆదాయానికి గండి పడింది. అయితే, ప్రస్తుతం ఇండియా మరో వ్యూహాత్మక దాడికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియా లో పెట్టుబడులు పెట్టిన అనేక చైనా కంపెనీలకు ఆ దేశ ఆర్మీ తో సత్సంబంధాలు ఉన్నట్లు భారత్ గుర్తించింది. అమెరికా కు చెందిన ప్రముఖ పరిశోధక సంస్థ కూడా ఈ విషయాన్నీ నిరూపించటంతో ఇప్పుడు ఇండియా వాటి భరతం పట్టేందుకు సమాయత్తమవుతోంది.
కీలక అడుగు: అమెరికాలో భారత్ చమురు నిల్వలు.. ఎందుకంటే
జాబితాలో అలీబాబా, టెన్సెన్ట్ ...
చైనా ఆర్మీ తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న కంపెనీల జాబితాలో ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా కూడా ఉండటం విశేషం. అలాగే మరో ప్రముఖ చైనా పెట్టుబడి సంస్థ టెన్సెన్ట్ కూడా ఉంది. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. ఇందులో మరిన్ని కంపెనీల పేర్లు కూడా బహిర్గతం అయ్యాయి. హువావే, క్సిందిగా స్టీల్స్, క్సింక్సిన్ క్యాథెయ్ ఇంటర్నేషనల్ గ్రూప్, చైనా ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ గ్రూప్ కార్పొరేషన్, సైక్ మోటార్ కార్పొరేషన్ వంటి కంపెనీలు కూడా ఈ జాబితా లో ఉన్నాయి. ఇవన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా భారత్ లో, భారత కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయి. దీంతో ప్రస్తుతం భారత ప్రభుత్వం వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలా అన్న అంశంపై తీవ్రంగా సమాలోచనలు జరుపుతోంది. నిపుణుల సలహాలు తీసుకొంటోంది.
పేటీఎం, బిగ్ బాస్కెట్ లకు కష్టకాలం...
చైనా కుబేరుడు జాక్ మా కు చెందిన అలీబాబా గ్రూప్ ఇండియాలో భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇందులో పేటీఎం, జొమాటో, స్నాప్ డీల్ వంటి కంపెనీల్లో భారీ పెట్టుబడులు పెట్టింది. ఇవి కాకుండా బిగ్ బాస్కెట్ లో కూడా అలీబాబా ఇన్వెస్ట్ చేసింది. అదే సమయంలో టెన్సన్ట్ హోల్డింగ్స్ కూడా భారత స్టార్టుప్ కంపెనీల్లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టటం విశేషం. ఇందులో బైజూస్, ఓలా తో పాటు స్విగ్గి లో కూడా పెట్టుబలు పెట్టింది. ఇండియాలో ప్రస్తుతం విజయవంతంగా నడుస్తున్న దాదాపు ప్రతి స్టార్టుప్ కంపెనీలో చైనా కు చెందిన పెట్టుబడి సంస్థలు ఇన్వెస్ట్ చేయటం గమనార్హం. అయితే, వాటిని గుర్తించటం ఒక ఎత్తైతే... చర్యలు తీసుకోవటం మరో ఎత్తు. ఒక్కసారిగా ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకుంటే వచ్చే పరిణామాలను అంచనా వేసిన తర్వాతే ముందుకు వెళ్లేలా ప్రళాళికలు రచిస్తోంది. దీంతో పేటీఎం, బిగ్ బాస్కెట్ వంటి కంపెనీలకు కష్టకాలం మొదలైనట్లేనని భావిస్తున్నారు.
చర్యలు తప్పవు...
అమెరికన్ కాంగ్రెషనల్ కమిషన్ సుమారు 20 చైనీస్ కంపెనీలు ఆ దేశ ఆర్మీ కి సన్నిహితంగా ఉంటాయని గుర్తించింది. అవన్నీ కూడా చైనీస్ రెడ్ ఆర్మీ తో సంబంధాలు కలిగి ఉన్నట్లు పేర్కొంది. దీంతో ఇండియన్ గవర్నమెంట్ కూడా వీటిపై తగిన చర్యలకు సిద్ధమవుతోంది. కానీ, ఎప్పుడు ఎలా వాటిపై కొరఢా ఝుళిపించాలనేది మాత్రం ఇంకా నిర్ణయించలేదని సమాచారం. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ సైక్ మోటార్ గ్రూప్ నకు చెందినదే ఎంజి మోటార్స్. ప్రస్తుతం ఎంజి మోటార్స్ ఇండియా లో ఎంజి హెక్టర్ పేరుతో లగ్జరీ కార్లను విక్రయిస్తున్న విషయం తెలిసిందే. కాగా, సైక్ మోటార్స్ కు చెందిన ఒక అనుబంధ సంస్థ ఐన నాంజింగ్ ఆటోమొబైల్ గతంలో పీఎల్ఏ కు వెహికల్ సర్వీసింగ్ యూనిట్ గా ఉన్న విషయం ఇక్కడ గమనార్హం.