ఇళ్ళ ధరలు భారీగా పెరిగాయ్, హైదరాబాద్లో ఎంత పెరిగిందంటే?
ఇళ్లు, ఫ్లాట్ల ధరలు ఇటీవలి కాలంలో పెరిగినట్లు క్రెడాయ్ హౌసింగ్ ప్రైస్ ట్రాకర్ రిపోర్ట్ 2022 నివేదిక వెల్లడిస్తోంది. డిమాండ్కు తోడు ముడి పదార్థాల ధరలు పెరగడం ఇందుకు కారణమని క్రెడాయ్, కాలియర్స్, లియాసెస్ ఫోరాస్ సంయుక్త నివేదిక తెలిపింది. 2021 జనవరి - మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది ఇదే సమయంలో ఇళ్ల ధరలు గరిష్టంగా 11 శాతం పెరిగినట్లు తెలిపింది. ఇళ్ల ధరలు ఏడాది ప్రాతిపదికన ఢిల్లీలో అత్యధికంగా 11.3 శాతం పెరిగింది. హైదరాబాద్లో తొమ్మిది శాతం పెరిగింది.
ఢిల్లీ-ఎన్సీఆర్లో చదరపు అడుగుకు రూ.7363గా, హైదరాబాద్లో రూ.9232 ఉంది. అహ్మదాబాద్లో 8 శాతం పెరిగి రూ.5721, కోల్కతాలో 6 శాతం పెరిగి రూ.6245, పుణేలో 3 శాతం పెరిగి రూ.7485, బెంగళూరులో 1 శాతం పెరిగి రూ.7595, చెన్నైలో 1 శాతం పెరిగి రూ.7107, ముంబైలో 1 శాతం పెరిగి రూ.19557గా ఉంది. దేశవ్యాప్తంగా నిర్మాణాలు సగటున 4 శాతం పెరిగాయి. నిర్మాణ వ్యయాల వల్ల వచ్చే ఆరు నుండి తొమ్మిది నెలల్లో ఇళ్ల ధరలు మరో 5 శాతం నుండి 10 శాతం పెరగవచ్చునని చెబుతున్నారు. అయితే సిమెంట్, స్టీల్ ధరలు తగ్గనున్న నేపథ్యంలో ధరలు పెరిగే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.
పెట్రోల్ ధరలు తగ్గితే ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాణ రంగానికి ఎంతో ఊరట కలుగుతుందని, అలాగే స్టీల్, సిమెంట్ తదితర ఉత్పత్తుల ధరలు తగ్గేలా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని, గత ఏడాదిన్నర కాలంగా ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్నట్లు క్రెడాయ్ అధ్యక్షులు తెలిపారు. దేశంలోని మొత్తం ఎనిమిది మెట్రో నగరాల్లో ఇళ్లకు డిమాండ్ కనిపిస్తోందని చెబుతున్నారు.