కరోనా దెబ్బ, అప్పుల ఊబిలోకి కుటుంబాలు, పడిపోయిన సేవింగ్స్, పెరిగిన అప్పు: RBI నివేదిక
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలను ఆర్థిక ఇబ్బందుల్లోకి, తద్వారా అప్పుల ఊబిలోకి నెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020-21 రెండో త్రైమాసికంలో భారతీయ కుటుంబాల అప్పులు జీడీపీలో 37.1 శాతానికి పెరిగాయి. అదే సమయంలో సేవింగ్స్ రేటు 10.4 శాతం క్షీణించింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) తాజా నివేదిక స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా, దేశంలో ఎన్నో ఉద్యోగాలు పోయాయి. కంపెనీలు ఉద్యోగాల కోత అమలు చేశాయి. దీంతో ఎన్నో కుటుంబాలు ఇంటి ఖర్చులు, అవసరాల కోసం సేవింగ్స్ తగ్గించుకోవడం, అప్పులు చేయడం జరిగింది.
సేవింగ్స్
2020-22 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మొత్తం రుణాల్లో కుటుంబాల వాటా 51.5 శాతానికి చేరుకుంది. FY21లోని మొదటి త్రైమాసికంలో సేవింగ్స్ రేటు 21 శాతంగా ఉండగా, రెండో త్రైమాసికానికి 10.4 శాతానికి పడిపోయింది. 2019-20 రెండో త్రైమాసికంలో ఇది 9.8 శాతంగా మాత్రమే ఉంది. ఏడాది ప్రాతిపదికన ఎక్కువే. సాధారణంగా వృద్ధి నిలిచిపోయినా లేదా క్షీణించినా కుటుంబాల సేవింగ్స్ పెరుగుతాయి. కానీ ఈసారి మొదటి త్రైమాసికంలో వృద్ధి 24 శాతం మేర క్షీణించినా సేవింగ్స్ రేటు 21 శాతంగా ఉండటం గమనార్హం.
చేతిలో నగదు తగ్గింది
రెండో త్రైమాసికంలో వృద్ధి మైనస్ 7.5 శాతంగా ఉండగా, సేవింగ్స్ రేటు 10.4 శాతానికి తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 35.4 శాతంగా ఉన్న కుటుంబాల అప్పు, రెండో త్రైమాసికానికి 37.1 శాతానికి పెరిగింది. కుటుంబాల డిపాజిట్స్, అప్పులు పెరగగా, నగదు నిల్వలు, పెట్టుబడులు తగ్గాయి. గత మార్చి నాటికి ప్రజల వద్ద ఉన్న నగదు జీడీపీలో 5.3 శాతం కాగా, గత సెప్టెంబర్ నాటికి 0.4 శాతానికి పడిపోయింది.
పేదరికంలోకి..
మొదటి నుండి సేవింగ్స్ చేయని కుటుంబాలు కరోనాతో మరిన్ని కష్టాల పాలయ్యాయి. బంధువులను, స్నేహితులను లేదా బ్యాంకులు, NBFCల నుండి అప్పులు చేశాయి. సేవింగ్స్ లేని లేదా కావాల్సినంత నిధులు లేని 3.2 కోట్ల మంది మధ్యతరగతి ప్రజలు పేదరికంలోకి వెళ్లిపోయారు. దీంతో కరోనాకు ముందు దేశంలో 9.9 కోట్లున్న మధ్యతరగతి జనాభా ప్రస్తుతం 6.6 కోట్లకు పడిపోయినట్లు ఈ నివేదిక తెలిపింది.