10 ఏళ్ల కనిష్టానికి రియల్ ఎస్టేట్: హైదరాబాద్లో పరిస్థితి ఏమిటి?
కరోనా మహమ్మారి కారణంగా 2020 తొలి అర్ధ సంవత్సరంలో(H1) రియల్ ఎస్టేట్ భారీగా పడిపోయిందని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఈ వైరస్ కారణంగా వివిధ రంగాలు భారీ సంక్షోభంలో కూరుకుపోయాయి. ఎక్కువ ప్రభావం పడిన వాటిలో రియల్ రంగం కూడా ఉంది. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో సేల్స్ ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా పదేళ్ల కనిష్టానికి పడిపోయినట్లు తెలిపింది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ఉద్దేశించిన లాక్ డౌన్ కాలంలో డిమాండ్ మరింతగా క్షీణించినట్లు తెలిపింది.
న్యూయార్క్ లగ్జరీ ఫ్లాట్లో టెక్ కంపెనీ సీఈవో దారుణ హత్య
54 శాతం తగ్గిన సేల్స్
దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ధరలు కూడా తగ్గాయి. అదే విధంగా హౌసింగ్ సేల్స్ పడిపోయాయి. 2019 జనవరి నుండి జూన్ మధ్య సేల్స్తో పోలిస్తే ఈసారి 54 శాతం తగ్గి 59,538 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇందులో ఎక్కువ సేల్స్ ఈ క్యాలెండర్ ఇయర్ (2020) తొలి క్వార్టర్లో జరిగాయి. లాక్ డౌన్ తర్వాత క్షీణించాయి. ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, ముంబై, చెన్నై, బెంగళూరు, పుణే, అహ్మదాబాద్ నగరాలలో అధ్యయనం చేసింది.
హైదరాబాద్, చెన్నైలో పూర్తిగా క్షీణించిన డిమాండ్
ఏప్రిల్-జూన్ (క్యాలెండర్ ఇయర్ రెండో క్వార్టర్) అంటే లాక్ డౌన్ సమయంలో భారీగా 84 శాతం మేర తగ్గి కేవలం 9,632 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై నగరాల్లో డిమాండ్ పూర్తిగా క్షీణించినట్లు తెలిపింది. ఈ మూడు ప్రాంతాల్లో అయితే సేల్స్ దాదాపు జీరోకు పడిపోయాయి. గత రెండేళ్లుగా రియల్ ఎస్టేట్ రంగానికి సానుకూలంగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజూల్ అన్నారు. ప్రస్తుత పరిస్థితులు దీనిని మరింత సంక్షోభంలోకి నెట్టేలా ఉందన్నారు.
మరిన్ని చర్యలు అవసరం
ప్రస్తుతం ఆదాయాలపై అనిశ్చితులు ఉన్నాయని, ఈ ప్రభావం ఇళ్ల డిమాండ్ పైన ఉంటుందని చెప్పారు. ఇప్పటికే వడ్డీ రేట్లు తగ్గించడం కాస్త ఉపశమనం, ప్రోత్సాహకం కలిగించే అంశమని, అయినప్పటికీ ఇళ్ల డిమాండ్ పెంచేందుకు మరిన్ని చర్యలు అవసరమని చెప్పారు. ఆగస్ట్ నెలలో రెండో దశ మారటోరియం ముగియనుందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, రుణగ్రహీతలకు కొన్ని వెసులుబాట్లు కల్పించాలన్నారు.
అక్కడ తగ్గిన ధరలు, ఇక్కడ పెరిగాయి
2019 జనవరి-జూన్ మధ్య 1,29,285 ఇళ్లు విక్రయించగా, ఈసారి 54 శాతం తగ్గి 59,538 యూనిట్లకు పరిమితమైంది. చాలా నగరాల్లో సగటు ధర పడిపోయింది. ఢిల్లీలో 5.8 శాతం, పుణేలో 5.4 శాతం, చెన్నైలో 5.5 శాతం మేర ధరలు తగ్గాయి. ఐటీ ఆధారిత హైదరాబాద్లో 3.3 శాతం, బెంగళూరులో 6.9 శాతం ధరల్లో వృద్ధి చోటు చేసుకుంది. అందుబాటులోని ధరల ఇళ్ల వైపే కొనుగోలుదారులు దృష్టి సారిస్తున్నారు. మొదటి అర్ధ సంవత్సరంలో విక్రయించిన ఇళ్లలో 47 శాతం రూ.50 లక్షల కంటే తక్కువ ఇళ్లే. హైదరాబాద్లో హౌసింగ్ సేల్స్ 8,334 యూనిట్ల నుండి 43 శాతం పడిపోయి 4,782కు చేరుకున్నాయి. దశాబ్దకాలంలో ఇది కనిష్టం.
హైదరాబాద్లో ఆఫీస్ స్థలం...
ఆఫీస్ స్పేస్ విషయానికి వస్తే హైదరాబాదులో ఈ 6 నెలల కాలంలో 43 శాతం క్షీణించింది. గత అయిదేళ్ల కాలంలో హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ 172 శాతం వృద్ధిని నమోదు చేయగా, గత ఏడాది రికార్డ్ స్థాయిలో.. 8 నగరాల్లోనే అత్యధికంగా 1.28 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పీస్ లీజుకు వెళ్లింది. ఈ జనవరి-జూన్ మధ్య 22 లక్షల చ.అ.కే పరిమితమైంది. నిర్మాణ పరంగా 32 శాతం తగ్గగా, కో-వర్కింగ్ కార్యాలయాల స్థలాలపై 75 శాతం వరకు ప్రభావం పడింది. అయితే పరిస్థితులు కుదుటపడితే డిమాండ్ పెరుగుతుందని చెబుతున్నారు.