హమ్మయ్య.. నియామకాలు పుంజుకుంటున్నాయ్, కానీ అనిశ్చితిలోనే యువత
కరోనా మహమ్మారి నేపథ్యంలో భారీగా పడిపోయిన నియామకాలు క్రమంగా కోలుకుంటున్నాయి. భారత్ నియామక రేటు ఏప్రిల్ నెలలో 10 శాతం ఉండగా, మే 2021లో 3 శాతానికి పెరిగింది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం ప్రొఫెషనల్స్ ఆర్థిక అనిశ్చితికి గురవుతున్నారని లింక్డిన్ డేటా వెల్లడిస్తోంది. భారత్ హైరింగ్ రేటు 2021 మార్చి నెలలో 50 శాతంగా ఉండగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్ నాటికి ఏకంగా 10 శాతానికి పడిపోయింది. ఇప్పుడు మే నెలలో 35 శాతానికి చేరుకుంది.
నియామక రేటు పెరుగుతున్నప్పటికీ...
నియామక రేటు పెరుగుతున్నప్పటికీ వర్కింగ్ వుమెన్, యంగ్ ప్రొఫెషనల్స్ ఆర్థికంగా ఆందోళనకు గురవుతున్నట్లు లింక్డిన్ పేర్కొంది. ఈ డేటా ప్రకారం వర్కింగ్ మెన్ కంటే వర్కింగ్ వుమెన్ నాలుగు రెట్ల మేర తక్కువ విశ్వాసం కలిగి ఉన్నారు. అలాగే కొత్త గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు పొందే సగటు సమయం రెండు నుండి మూడు నెలలకు పెరిగింది. మహిళా ఉద్యోగులు, యువ నిపుణులు ఇంకా తమ భవిష్యత్తుపై నిరాశావాదంతో ఉన్నారు.
ఈ నియామకాల్లో క్షీణత
లింక్డిన్ పైన ఫైనాన్స్, కార్పొరేట్ సేవలు, తయారీ, ఆరోగ్య సంరక్షణ, హార్డ్ వేర్, నెట్ వర్కింగ్ రంగాల కంపెనీలు చురుగ్గా నియామకాలు చేపడుతున్నాయి. వినియోగ ఉత్పత్తులు, మీడియా, కమ్యూనికేషన్స్, ఆటోమోటివ్, మార్కెటింగ్, ప్రకటనలు స్టాఫింగ్, రిక్రూటింగ్ కంపెనీల నియామకాలు క్షీణించాయి.
వీటికి డిమాండ్
దేశంలోని పది కంపెనీల్లో తొమ్మిది కంపెనీలు పదవులను కలిపివేసి, అంతర్గతంగా పదువుల భర్తీ కోసం చూస్తున్నాయి. ప్రోడక్ట్ మేనేజ్మెంట్, కన్సల్టింగ్, ప్రోగ్రాం అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇందులో ఉన్నాయి. గత క్యాలెండర్ ఏడాదిలో స్పెషలైజ్డ్ ఇంజినీరింగ్, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది.