గుడ్న్యూస్, వచ్చే క్వార్టర్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయ్
వచ్చే మూడు నెలల్లో నియామకాలు పుంజుకోవచ్చునని మ్యాన్పవర్ ఇండియా సర్వేలో వెల్లడైంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, విద్య, సేవారంగాల్లో అధికంగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో నికర ఉద్యోగ కల్పన 9 శాతం మేర ఉండవచ్చు ఈ సర్వే తెలిపింది. బడ్జెట్ ప్రతిపాదనలు ఉద్యోగాల సృష్టికి అవకాశం కల్పిస్తున్నాయి. మౌలిక, ఆరోగ్య సంరక్షణ, బీఎఫ్ఎస్ఐ రంగాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోందని మ్యాన్ పవర్ గ్రూప్ ఇండియా ఎండీ సందీప్ గులేటి అన్నారు.
నియామకాల జూమ్
ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం వెచ్చించిన నిధుల ప్రభావం సెప్టెంబర్, డిసెంబర్ త్రైమాసికాల్లో కనిపించవచ్చునని ఈ సర్వే అభిప్రాయపడింది. టోకు, రిటైల్ వ్యాపార రంగాల్లో నియామకాలు పరిమితంగా ఉండవచ్చునని తెలిపింది. నియామకాలపరంగా 2021 జూన్ వరకు కరోనా ముందుస్థాయికి చేరుతామని 27 శాతం కంపెనీలు వెల్లడించగా, 2021 చివరినాటికి ఆ స్థాయిని అందుకుంటామని 56 శాతం సంస్థలు తెలిపాయి. దేశవ్యాప్తంగా 2,375 కంపెనీల యాజమాన్యాలు ఈ సర్వేలో పాల్గొన్నారు.
వచ్చే త్రైమాసికంలో నియామకాలు
జనవరి - మార్చి త్రైమాసికంలో 8 శాతం నియామకాలు ఉండగా, వచ్చే త్రైమాసికం నాటికి మరింత పెరుగుతాయని ఈ సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 12 శాతం చెప్పాయి. నియామకాలు తగ్గుతాయని రెండు శాతం కంపెనీలు చెప్పగా, 53 శాతం కంపెనీలు మాత్రం నియామకాల్లో మార్పు ఉండదని వెల్లడించాయి. గత త్రైమాసికంతో పోలిస్తే ఈ త్రైమాసికంలో నియామకాలు పెరిగినట్లు తెలిపింది.
మరో సర్వేలో...
ఈ ఏడాది ప్రథమార్ధంలో అప్రెంటిస్లకు అవకాశాలు పెరగనున్నాయని టీమ్ లీజ్ తెలిపింది. ఈ ఏడాది ప్రథమార్ధంలో అప్రెంటిస్ నియామకాలను పెంచే యోచనలో ఉన్నట్లు ఈ సర్వేలో పాల్గొన్న 58 శాతానికి పైగా కంపెనీలు తెలిపాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే మహిళా అప్రెంటిస్లకు ప్రాధాన్యం 10 శాతం పెరిగిందని వెల్లడైంది.