గుడ్న్యూస్: పెరిగిన నియామకాలు, అక్టోబర్లో 5% వృద్ధి, కాంట్రాక్టు ఉద్యోగాలకు మొగ్గు
మెట్రో నగరాల్లో నియామకాలు, ఉద్యోగావకాశాలు పెరుగుతున్నట్లు జాబ్ పోర్టల్ సైకీ నివేదిక వెల్లడిస్తోంది. అంతకుముందు (సెప్టెంబర్) నెలతో పోలిస్తే అక్టోబర్ నెలలో ఐదు శాతానికి పైగా పెరిగిందని తెలిపింది. తమ వెబ్ సైట్లోని వివరాల మేరకు సైకీ ఈ వివరాలు తెలిపింది. కరోనా వైరస్ ప్రభావం, పండుగ సీజన్తో సంబంధం లేకుండా మెట్రో నగరాల్లో నియామకాలు పుంజుకుంటున్నాయని, సెప్టెంబర్ మాసంతో పోలిస్తే గత నెలలో 5.55 శాతం జాబ్ పోస్టింగ్స్ సంఖ్య పెరిగిందని సైకీ సహ వ్యవస్థాపకుడు అక్షయ్ శర్మ తెలిపారు. ఈ కామర్స్, ఫార్మా, టెలికం, బ్యాంకింగ్, బీమా, డాటా అనలిటిక్స్, ఐటీ సర్వీసెస్ తదితర రంగాలలో ఉద్యోగాలు పెరిగినట్లు పేర్కొంది.
భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోంది: మూడీస్ తర్వాత గోల్డ్మన్ శాక్స్ అంచనా
గత ఏడాది కంటే తగ్గుదల
కరోనా ప్రభావం ఉన్నప్పటికీ దేశంలోని మెట్రో నగరాల్లో నియామక రికవరీ సంకేతాలు కనిపిస్తున్నాయని తెలిపింది. సెప్టెంబర్తో పోలిస్తే, అక్టోబర్ నెలలో 5 శాతం కంటే ఎక్కువగా పెరగగా, ఏడాది ప్రాతిపదికన(2019 అక్టోబర్ నెలతో) పోలిస్తే 17.6 శాతం మేర నియామక కార్యకలాపాలు తగ్గినట్లు తెలిపింది. ఈ కామర్స్, ఫార్మా, ప్యాకేజింగ్, టెలికం, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, డేటా అనలిటిక్స్, ఐటీ సేవలు, పునరుత్పాదక ఇంధనంతో పాటు ఆతిథ్య రంగాల్లోను ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు నివేదిక తెలిపింది.
ఐటీ కాంట్రాక్టు వైపు మొగ్గు
ఉద్యోగాల్లోకి తీసుకోవడం కంటే పలు కంపెనీలు కాంట్రాక్టు పద్ధతిన నియమించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయని సైకీ తెలిపింది. ప్రధానంగా ఐటీ సేవల సంస్థల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోందని వెల్లడించింది. వర్క్ ఫ్రమ్ హోం నేపథ్యంలో టెలికం రంగంలో కూడా నియామక కార్యకలాపాలు పుంజుకున్నట్లు తెలిపింది. నెలవారీగా చూస్తే ఇటీవల నియామక ప్రక్రియలు మెరుగవుతున్నాయని తెలిపింది. రాబోయే నెలల్లో మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
ఉద్యోగాలు పోయి.. ఇప్పుడు కోలుకుంటున్నాయి
కరోనా కారణంగా మార్చి చివరి వారం నుండి పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోయిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆర్థిక కార్యకలాపాల పుంజుకోవడంతో నియామకాలు కూడా పెరుగుతున్నాయి. క్రమంగా హైరింగ్ పెరుగుతోందని తెలిపింది. ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ తదితర కంపెనీలు పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టనున్నాయి.