10.7శాతం వృద్ది: ఫస్ట్ క్వార్టర్లో అదిరిన హిందూస్తాన్ యునిలీవర్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో హిందుస్తాన్ యునిలీవర్ లిమిటెడ్ ఏకీకృత నికర లాభంలో 10.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.2,100 కోట్లు. గత ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.1,897 కోట్లుగా ఉంది. జూన్ త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు 13.21 శాతం పెరిగి రూ.11,966 కోట్లకు చేరుకున్నాయని హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది.
గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.10,570 కోట్లు అనే సంగతి తెలిసిందే. 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో హెచ్యూఎల్ మొత్తం వ్యయం రూ.9,546 కోట్లుగా ఉంది. 14.68 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ మొత్తం వ్యయం రూ.8,324 కోట్లుగా ఉంది.
సవాల్ గల వాతావరణంలో ఆదాయాలు, లాభాల పరంగా బలమైన పనితీరును అందించామని.. త్రైమాసికంలో మా పనితీరు స్థితిస్థాపకంగా ఉందని హెచ్యూఎల్ సీఎండీ సంజీవ్ మెహతా అన్నారు. తమ సామర్థ్యాలు, కార్యకలాపాలు, పోర్ట్ఫోలియో అంతర్గత బలాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. వచ్చే రెండేండ్లలో డిమాండ్ పెరుగుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. బీఎస్ఈలో హెచ్యూఎల్ షేర్లు గురువారం 0.50 శాతం లాభంతో రూ.2,446.15 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ దేశంలో ప్రముఖ వినియోగదారుల వస్తువుల సంస్థ. ఇది బ్రిటిష్ ఎఫ్ఎంసీజీ కంపెనీ యూనిలీవర్కు అనుబంధ కంపెనీ. ఆహార పదార్థాలు, పానీయాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, వాటర్ ప్యూరిఫైయర్లను తయారు చేస్తుంది. 1931లో హిందుస్తాన్ కూరగాయల ఉత్పత్తి సంస్థగా స్థాపించారు. ఈ సంస్థకు 2007 జూన్ లో హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్గా పేరు వచ్చింది.