Hindustan Syringes: కాలుష్యం పేరుతో సిరంజీ, నీడిల్స్ తయారీ కంపెనీ మూత
చండీగఢ్: ఇంజెక్షన్లు వేయడానికి అవసరమైన సిరంజీలు, వాటి సూదులను తయారు చేసే అతి పెద్ద కంపెనీ హిందుస్తాన్ సిరంజీస్ మూత పడింది. పెద్ద ఎత్తున కాలుష్యం వెలువడటానికి కారణమౌతోందనే కారణంతో హర్యానాలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దీన్ని మూసివేయించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులను జారీ చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ హిందుస్తాన్ సిరంజీస్ కంపెనీ యాజమాన్యం.. ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాసింది.
IPL 2022: ప్రసార హక్కుల కోసం రిలయన్స్, అమెజాన్ సహా: రూ.40 వేల కోట్లు బిడ్డింగ్
హిందుస్తాన్ సిరంజీస్ అండ్ మెడికల్ డివైసెస్ పేరుతో హర్యానాలో ఈ తయారీ సంస్థ కొనసాగుతోంది. ఢిల్లీలో కాలుష్యానికి ఈ సంస్థ కూడా ఓ కారణమౌతోందనే ఉద్దేశంతో హర్యానా కాలుష్య నియంత్రణ మండలి కొద్దిరోజుల కిందటే ఉత్పత్తిని నిలిపివేయాలంటూ ఆదేశాలను జారీ చేసింది. ఫలితంగా- తయారీ యూనిట్లను మూసివేసిందా సంస్థ యాజమాన్యం. కరోనా వైరస్ను నిర్మూలించడానికి దేశంలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోన్న ఈ పరిస్థితుల్లో సిరంజీలు, నీడిల్స్ తయారీ సంస్థను మూసివేయించడం పట్ల విమర్శలు ఎదురవుతోన్నాయి.
ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ హిందుస్తాన్ సిరంజీస్ అండ్ మెడికల్ డివైసెస్ సంస్థ యాజమాన్యం ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాసింది. హర్యానా పీసీబీ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు.. సిరంజీలు, నీడిల్స్ సప్లయ్ చైన్ను దెబ్బ తీసేలా ఉందని పేర్కొంది. వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా సాగుతోన్న ఈ పరిస్థితుల్లో ఇలాంటి ఉత్తర్వులు వెలువడం సహేతుకం కాదని స్పష్టం చేసింది. సిరంజీలు, నీడిల్స్ సరఫరా వ్యవస్థ దెబ్బతింటుందని, వాటి కొరత ఏర్పడే ప్రమాదం లేకపోలేదని అభిప్రాయపడింది.
కాలుష్యానికి సరైన కారణాలను చూపించకుండా హర్యానా పీసీబీ అధికారులు ఈ ఉత్తర్వులను జారీ చేశారని హిందుస్తాన్ సిరంజీస్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ నాథ్ అన్నారు. ప్రధానమంత్రి కార్యాలయానికి రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద తయారీ యూనిట్లు, ఫ్యాక్టరీలను పునరుద్ధరించడానికి అనుమతి ఇవ్వాలని ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీలో కాలుష్యానికి కారణం అవుతున్నాయనే ఉద్దేశంతో హర్యానా కాలుష్య నియంత్రణ మండలి దేశ రాజధాని చుట్టుపక్కల ఉన్న 228 ఫ్యాక్టరీలను తక్షణమే మూసివేయాలంటూ ఆదేశాలను జారీ చేసింది. ఇందులో హిందుస్తాన్ సిరంజీస్ అండ్ మెడికల్ డివైసెస్ కూడా ఉంది. దేశంలో 60 శాతం వరకు వినియోగించే సిరంజీలు, నీడిల్స్ను తయారు చేసే సంస్థ ఇది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన విధంగా తాము కాలుష్య నియంత్రణ చర్యలను పాటిస్తున్నామని, డీజిల్ జనరేట్లను వినియోగించట్లేదని రాజీవ్ నాథ్ స్పష్టం చేశారు.