ఆదాయపు పన్ను: అధిక వేతనం ఉంటే షాక్, పీఎఫ్, ఎన్పీఎస్లో ఆ వాటాపై పన్ను
న్యూఢిల్లీ: గతేడాది సెప్టెంబర్ నెలలో కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించిన నేపథ్యంలో ఈ బడ్జెట్లో ఆదాయపుపన్ను ఊరట కూడా కల్పిస్తారని ఉద్యోగస్తులు ఆశలు పెట్టుకున్నారు. కానీ పాత పన్ను విధానాన్ని కొనసాగిస్తూనే కొత్త స్లాబ్స్ తీసుకు వచ్చారు. రెండింటిలో ఏదైనా ఎంచుకునే స్వేచ్ఛను ఉద్యోగులకు ఇచ్చారు. NPS, ప్రావిడెంట్ ఫండ్, సూపర్ యాన్యుయేషన్ ఫండ్స్ ఈ మూడింటికి కలిపి ఒక్కో ఉద్యోగి ఖాతాలో యజమాని వాటా ఏడాదికి రూ.7.5 లక్షలు దాటకుండా పరిమితి విధించాలని కేంద్రం నిర్ణయించింది. ఏడాదికి రూ.ఏడున్నర లక్షల వరకు వేతనం ఉండే వారికి దీని వల్ల నష్టం లేదు. కానీ రూ.7.5 లక్షల దాటితే ప్రభావం ఉంటుంది.
ఇక మీ ఇష్టం!: ఆదాయపు పన్ను శుభవార్తలో మెలిక.. కొత్త స్లాబ్స్లో 70 మినహాయింపులు కట్
పాత.. ప్రస్తుత పన్ను రేట్లు
- 0-2.5 లక్షల ఆదాయం - పాత పద్ధతి ప్రకారం పన్ను లేదు. కొత్త స్లాబ్లో పన్ను లేదు.
- 2.5 లక్షల నుండి రూ.5 లక్షల ఆదాయం - పాత పద్ధతి ప్రకారం పన్ను 5 శాతం. కొత్త స్లాబ్లో పన్ను 5 శాతం
- 5 లక్షల నుండి రూ.7.5 లక్షల ఆదాయం - పాత పద్ధతి ప్రకారం పన్ను 20 శాతం. కొత్త స్లాబ్లో పన్ను 10 శాతం
- 7.5 లక్షల నుండి రూ.10 లక్షల ఆదాయం - పాత పద్ధతి ప్రకారం పన్ను 20 శాతం. కొత్త స్లాబ్లో పన్ను 15 శాతం
- 10 లక్షల నుండి రూ.12.5 లక్షల ఆదాయం - పాత పద్ధతి ప్రకారం పన్ను 30 శాతం. కొత్త స్లాబ్లో పన్ను 20 శాతం
- 12.5 లక్షల నుండి రూ.15 లక్షల ఆదాయం - పాత పద్ధతి ప్రకారం పన్ను 30 శాతం. కొత్త స్లాబ్లో పన్ను 25 శాతం
- 15 లక్షలు, అంతకుమించి - పాత పద్ధతి ప్రకారం పన్ను 30 శాతం. కొత్త స్లాబ్లో పన్ను 30 శాతం
- ఇది 60 ఏళ్లలోపు వారికి వర్తిస్తుంది.
ఈ మూడింటికి పన్ను
వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి అధిక ఆదాయం వచ్చే వారు ప్రావిడెంట్ ఫండ్ (PF), నేషనల్ పెన్షన్ స్కీం (NPS), సూపరానుయేషన్ వంటి వాటికి కూడా ఆదాయపు పన్ను చెల్లించవలసి ఉంటుంది. ఈ మూడు కేటగిరీల్లో యాజమాన్య వాటాకు రూ.7.5 లక్షల ఆదాయ పరిమితిని ప్రతిపాదించింది. ఎవరైనా యజమాని ఈ మొత్తం కంటే ఎక్కువ చెల్లిస్తే దానిని సంబంధిత ఉద్యోగి అదనపు ఆదాయంగా పరిగణించి పన్ను విధించనున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు.
అందుకే పన్ను విధింపు
అధిక వేతనాలు కలిగినవారు మినహాయింపు-మినహాయింపు-మినహాయింపు కింద ప్రయోజనం పొందుతున్నారు. దీంతో ఎక్కువ జీతం కలిగిన వారికి పరిమితి ఉండాలని నిర్ణయించారు. అందుకే పీఎఫ్, ఎన్పీఎస్, సూపరానుయేషన్లలో యాజమాన్యం కాంట్రిబ్యూషన్ పైన పన్ను విధించాలని ప్రతిపాదించారు. ఈ విధానం ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్లో యజమాని వాటా ఉద్యోగి వేతనంలో 12 శాతం దాటితే పన్ను విధిస్తున్నారు.