హీరో బైక్స్ ప్రియులకు గుడ్న్యూస్: ఆ యూనిట్లన్నీ రీస్టార్ట్
న్యూఢిల్లీ: టూవీలర్ సెక్టార్లో దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోన్న హీరో మోటోకార్ప్ తీపికబురు అందించింది. సోమవారం నుంచి దేశంలోని అన్ని తయారీ యూనిట్లను పునరుద్ధరించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అన్ని యూనిట్లను సింగిల్ షిఫ్టుల్లో నిర్వహిస్తామని పేర్కొంది. నిజానికి- తయారీ యూనిట్ల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఈ నెల 17వ తేదీ నాడే చేపట్టాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల దాన్ని వచ్చే వారానికి వాయిదా వేసింది. పాక్షికంగా వాటిని ప్రారంభించింది. ఇక అన్ని యూనిట్లను అందుబాటులోకి తీసుకుని రానుంది.
SBI digital services: ఆదివారం..ఆ మూడు గంటలు: అన్నీ క్లోజ్: అ ఒక్కటే
దేశం మొత్తం మీద హీరో మోటోకార్ప్కు మొత్తం ఆరు తయారీ యూనిట్లు ఉన్నాయి. అందులో ఒకటి చిత్తూరులో ఏర్పాటైంది. హర్యానాలోని గుర్గావ్, ధారుహెరా, ఉత్తరాఖండ్లోని హరిద్వార్లల్లో పాక్షికంగా ఉత్పాదక కార్యకలాపాలు ఆరంభమయ్యాయి. ఈ నెల 24వ తేదీ నుంచి రాజస్థాన్లోని నీమ్రానా, గుజరాత్లోని హలోల్, ఏపీలో చిత్తూరుల్లో గల తయారీ ప్లాంట్లను పునరుద్ధరిస్తామని, ఇప్పటిదాకా తాత్కాలికంగా మూసివేసిన అన్నింట్లోనూ సింగిల్ షిఫ్ట్లో ఉత్పత్తి ప్రారంభిస్తామని తెలిపింది.
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హీరో మోటోకార్ప్ సంస్థ యాజమాన్యం ఈ ఆరు యూనిట్లను తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే. కిందటి నెల 22వ తేదీన తొలిసారిగా వారం రోజుల పాటు అన్ని ప్లాంట్లను మూసివేసింది. క్రమంగా వాటిని వారం వారం పొడిగించుకుంటూ పోయింది. ఈ నెల 17వ తేదీన మూడు యూనిట్లలో ఉత్పత్తిని పాక్షికంగా మాత్రమే చేపట్టింది. ఇక వచ్చే సోమవారం నుంచి మిగిలిన మూడు యూనిట్లను కూడా పునరుద్ధరిస్తామని వెల్లడించింది. లాక్డౌన్ను ఎత్తేసిన వెంటనే మార్కెట్లోకి కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టేలా ప్రణాళికను రూపొందించుకుంది.