బీమా కంపెనీలకు పండగే... ప్రీమియం వసూళ్లు ఎంత పెరిగాయో తెలుసా ?
ఆరోగ్య బీమా ఈ రోజుల్లో ఎంత కీలకంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆస్పత్రిలో చేరితే లక్షల రూపాయలు ఖర్చవుతున్న రోజులివి. ఈ బిల్లులు చెల్లించాలంటే ఇల్లంతా గుల్లయ్యే పరిస్థితి. డబ్బులు లేని వారు అప్పుల పాలు అవుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే చాలా మంది ఆరోగ్య బీమా తీసుకుంటున్నారు. వ్యాధులు చెప్పి రావు. డెంగ్యులాంటి వ్యాధులను ఊహించే పరిస్థితి లేదు. డెంగ్యూ బారిన పడినా చికిత్స కోసం లక్షకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అందుకే భారం అనుకోకుండా చాలా మంది ఆరోగ్య బీమాను తీసుకుంటున్నారు. దీని ఫలితంగానే ఆరోగ్య బీమా కంపెనీల వ్యాపారంలో వృద్ధి నమోదు అవుతోంది.
20 శాతానికి పైగా వృద్ధి
* బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ విడుదల చేసిన తాజా వార్షిక నివేదిక ప్రకారం... 2018-19 ఆర్ధిక సంవత్సరంలో ఆరోగ్య బీమా కంపెనీల ప్రీమియం వసూళ్లు 21.2 శాతం మేర పెరిగి 44, 873 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. అంతకు క్రితం ఆర్ధిక సంవత్సరంలో ప్రీమియం వసూళ్లు 37,029 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.
* వరుసగా నాలుగో సంవత్సరంలోనూ ప్రీమియం వసూళ్లు పెరగడం విశేషం.
* సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీలు గత ఆర్ధిక సంవత్సరంలో 2.07 కోట్ల ఆరోగ్య బీమా పాలసీలను జారీ చేశాయి.వీటి ద్వారా 47.20 కోట్ల మంది జీవితాలకు బీమా రక్షణ లభించింది.
ప్రభుత్వ రంగ కంపెనీల వాటాయే అధికం
* ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో నాలుగు బీమా కంపెనీలు ఉన్నాయి. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో వసూలైన మొత్తం ప్రీమియం లో ఈ కంపెనీల మార్కెట్ వాటాయే 52 శాతంగా ఉంది. అయితే 2017-18 సంవత్సరంతో పోల్చితే వాటా తగ్గింది. ఈ సంవత్సరంలో వాటా 58 శాతంగా ఉంది.
* 2016-17 సంవత్సరంలో ఈ కంపెనీల మార్కెట్ వాటా 63 శాతంగా ఉంది.
* ప్రయివేట్ రంగంలోని బీమా కంపెనీలు వినూత్న బీమా ఉత్పత్తులను తీసుకువస్తూ మార్కెట్ వాటాను పెంచుకుంటున్నాయి. సర్వీసులు అందించడంలోనే ఈ కంపెనీలు పోటీ పడుతున్నాయి.
* ప్రైవేట్ రంగంలోని కంపెనీల మార్కెట్ వాటా 2018-19 సంవత్సరంలో 24 శాతంగా ఉంది. అంతకు ముందు సంవత్సరంలో ఇది 21 శాతంగా ఉంది. 2016-17 సంవత్సరంలోవాటా కేవలం 19 శాతమే ఉంది. ఆరోగ్య బీమాలో అపార అవకాశాలు ఉన్న నేపథ్యంలో వీటిని అందిపుచ్చుకోవడానికి ప్రయివేట్ బీమా కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
గ్రూప్ బీమా ఎక్కువే..
* కంపెనీలు, ఇతర సంస్థల నుంచి గ్రూప్ బీమాకు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. అందుకే మొత్తం ప్రీమియంలోనూ ఈ విభాగం వాటా అధికంగా ఉంటోంది.
* 2018-19 సంవత్సరంలో వసూలైన మొత్తం ప్రీమియంలో గ్రూప్ ఇన్సూరెన్సు వాటా 48 శాతంగా ఉంది. అంటే ఈ మొత్తం రూ. 21,676 కోట్లు వరకు ఉంది.
* వ్యక్తిగత విభాగం వాటా 39 శాతం అంటే 17,525 కోట్లు, ప్రభుత్వ వ్యాపారం వాటా 13 శాతం గా ఉంది. ఏడాది కాలంలో గ్రూప్ ఇన్సూరెన్సు వాటా ఏమాత్రం తగ్గ లేదు. ప్రభుత్వ వ్యాపారం పెరగా వ్యక్తిగత బీమా వ్యాపారం మాత్రం తగ్గింది.
* గత ఐదేళ్ల కాలంలో వ్యక్తిగత, గ్రూప్ ఇన్సూరెన్సు ప్రీమియం పైగా పెరిగింది.