వాహన కొనుగోలుదారులకు HDFC ఊరట, ఆ కమీషన్ వెనక్కిస్తాం
వాహన రుణాలు తీసుకొని, GPS పరికరాలను కూడా కొనుగోలు చేసిన కస్టమర్లకు HDFC బ్యాంకు ఊరట కల్పించే న్యూస్ చెప్పింది. కొనుగోలు చేసిన కస్టమర్లకు కమీషన్లను త్వరలో తిరిగి చెల్లిస్తామని తెలిపింది. 2013-14 నుండి 2019-20 ఆర్థిక సంవత్సరం మధ్య వెహికిల్ లోన్స్ తీసుకున్న కస్టమర్లతో HDFC బ్యాంకు జీపీఎస్ పరికరాలను కూడా కొనుగోలు చేయించింది. ఆయా పరికరాల విక్రయాల రూపంలో కమీషన్ పొందింది. అయితే వాహన రుణాల్లో అవకతవకలు జరిగినట్లు విమర్శలు వచ్చాయి. దీనికి సంబంధించి ఆర్బీఐ రూ.10 కోట్ల జరిమానా విధించింది.
జీపీఎస్ పరికరాలు కొనుగోలు చేయించిందనే ఆరోపణలు
వాహన రుణాలు తీసుకొని, జీపీఎస్ పరికరాలను కొనుగోలు చేసిన వారికి కమీషన్లను తిరిగి చెల్లించనున్నట్లు HDFC బ్యాంకు ప్రకటించింది. బ్యాంకు వద్ద నమోదైన కస్టమర్ల ఖాతాలకు వచ్చే ముప్పై రోజుల్లో ఈ మొత్తాన్ని జమ చేస్తామని స్పష్టం చేసింది. వీటికి సంబంధించి కస్టమర్లు బ్యాంకు శాఖలను సంప్రదించవచ్చునని తెలిపింది. వాహన రుణ దరఖాస్తును ఆమోదించే సమయంలో కస్టమర్తో రూ.18,000 విలువ చేసే జీపీఎస్ పరికరాన్ని HDFC బ్యాంకు కొనుగోలు చేయించిందనే ఆరోపణలు ఉన్నాయి.
అందుకే వెనక్కి...
నిబంధనల మేరకు బ్యాంకు లు ఇతర ఉత్పత్తులను విక్రయించరాదు. అయితే జీపీఎస్ పరికరాలను కొనుగోలు చేయించిందనే ఆరోపణలు వచ్చినప్పుడు బ్యాంకు సీఈవో ఆదిత్య పురి గత ఏడాది తమ బృందం వాహన రుణ పంపిణీలో అక్రమాలకు పాల్పడినట్లు అంగీకరించారు. దీనికి సంబంధించి ఈ ఏడాది ప్రారంభంలో జరిమానా విధించింది ఆర్బీఐ. దీంతో జీపీఎస్ డివైజ్ కమిషన్ను వెనక్కి ఇస్తున్నట్లు తెలిపింది బ్యాంకు.
కొత్త క్రెడిట్ కార్డులపై..
మరోవైపు, కొత్త క్రెడిట్ కార్డ్ అమ్మకాలపై నియంత్రణ నిషేధానికి దారి తీసిన నెట్ వర్క్ వైఫల్యాలు ట్రాన్సాక్షన్స్ పరిమాణం వల్ల జరిగినవి కాదని, దీనిపై ఆర్బీఐ సంప్రదింపులు జరుపుతున్నామని, ఈ సేవల్ని ఎప్పటి నుండి ప్రారంభిస్తామనే అంశాన్ని కచ్చితంగా చెప్పలేమని HDFC మరో ప్రకటనలో తెలిపింది. నెట్ వర్క్ వరుస వైఫల్యాలతో 2020 డిసెంబర్లో కొత్త క్రెడిట్ కార్డులు మంజూరు చేయరాదని కొత్త డిజిటల్ సేవల్ని ప్రారంభించవద్దని ఆర్బీఐ ఆదేశించింది.