విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్కు భిన్నంగా.. ఉద్యోగులకు HCL బోనస్, 15,000 కొత్త ఆఫర్లకు ఓకే
కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశంలో, ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కొన్ని కంపెనీలు వేతనాలు తగ్గిస్తున్నాయి. కొన్ని కంపెనీలు మాత్రమే వేతనాలు యథాతథంగా ఉంచడం లేదా ఉద్యోగులకు బోనస్లు ఇవ్వడం వంటివి చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వేతనాలు తగ్గించకపోయినా లేదా బోనస్లు ఇచ్చినా ప్రాధాన్యత సంతరించుకుంది. ఐటీ దిగ్గజం HCL టెక్ తమ సంస్థలో పనిచేసే 1,50,000 మంది ఉద్యోగులలో ఎవరినీ తొలగించడం లేదు. అంతేకాదు, ఎవరికీ వేతనాల్లో కోత విధించడం లేదు.
షాకింగ్: ఆటోమేషన్తో ఐటీ రంగంలో తగ్గుతున్న ఉద్యోగాలు... ఎంత తగ్గాయంటే!
లాక్డౌన్ వేళ.. మాట ప్రకారం ఉద్యోగులకు బోనస్
కరోనా కారణంగా దాదాపు రెండు నెలలుగా ఐటీ సంస్థలు తెరుచుకోలేదు. అయితే 90 శాతం మంది వరకు ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కంపెనీలు ఆర్థిక నష్టాల్లో ఉండటంతో కోత విధిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది ఇచ్చిన బోనస్ హామీని లాక్ డౌన్ సమయంలో నెరవేరుస్తోంది HCL. బెంగళూరు ప్రధాన కేంద్రంగా ఈ సంస్థ ఐటీ సేవలు అందిస్తోంది. దేశంలో మూడో అతిపెద్ద ఐటీ రంగ సంస్థ. గత ఏడాది ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు బోనస్ ఇస్తున్నట్టుగా తాజాగా ప్రకటించింది.
15,000 మంది కొత్త వారికి 'ఆఫర్' ఉంది
15,000 ఉద్యోగాల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని కూడా నిర్ణయించినట్లు సంస్థ చీఫ్ హ్యుమన్ రిసోర్స్ ఆఫీసర్ వీవీ అప్పారావు తెలిపారు. గతంలోనే వీరికి ఇచ్చిన ఆఫర్లు గౌరవిస్తామన్నారు. గతంలో వచ్చిన ప్రాజెక్టులు రద్దు కాలేదని, అయితే కొత్త ప్రాజెక్టులు రావడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. ఈ రోజు తాము 5,000 కొత్త ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
అప్రైజల్స్.. బోనస్
ప్రతి ఏడాదిలాగే జూలైలో రావాల్సిన అప్రైజల్స్ కార్యక్రమాలను నోయిడాలోని హెడ్క్వార్టర్స్ చేపట్టిందన్నారు. దీనిపై నిర్ణయం ఉంటుందన్నారు. ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం లేదా బోనస్ను నిలిపివేయడం గానీ చేయడం లేదని అప్పారావు తెలిపారు. గత 12 నెలల్లో తమ ఉద్యోగులు చేసిన పనిని తాము గౌరవించాలని, దీనికి తాము కట్టుబడి ఉండాలని, అందుకే బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. కాగా, సాధారణంగా 16 శాతం నుండి 17 శాతం ఉండే అట్రిషన్ గత నెలలో 50 శాతం తగ్గినట్లు చెప్పారు.
వాటికి భిన్నంగా.. ఇలాంటి పరిస్థితుల్లో బోనస్..
2008 ఆర్థిక మాంద్యం సమయంలోను HCL ఉద్యోగులను తొలగించలేదని, అలాగే వారి వేతనాల జోలికి కూడా వెళ్లలేదని అప్పారావు చెప్పారు. తాము అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. కాగా, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, డబ్ల్యూఎన్ఎస్ తదితర ఐటీ సంస్థలు ఉద్యోగుల వేతనాల పెంపును, ప్రమోషన్లను వాయిదా వేశాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో హెచ్సీఎల్ బోనస్ ఇవ్వాలని నిర్ణయించడం గమనార్హం.