HCL Hiring: IT ఉద్యోగాల వేటలో ఉన్న ఫ్రెషర్లకు పండగే.. త్వరలో 10,400 ఉద్యోగుల నియామకం..
HCL Technologies: ప్రస్తుతం దేశంలోని ఐటీ కంపెనీలు లాభాల మార్జిన్ల విషయంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. రెండు రోజుల క్రితం త్రైమాసిక ఫలితాలు విడుదల చేసిన దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ లాభాలు అంచనాలను అందుకోలేదు. ప్రస్తుతం హెచ్సీఎల్ కంపెనీ సైతం అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. అయితే ఇప్పుడు కంపెనీలకు ఉన్న అతిపెద్ద ఛాలెంజ్ ఏమిటంటే ఉద్యోగుల వలసలు. పైగా ఉద్యోగుల వేతనాల ఖర్చులు సైతం ఐటీ కంపెనీలకు తడిసి మోపెడవుతోందని సంస్థలు చెబుతున్నాయి.
రానున్న మూడు నెలల్లో కొలువులు..
ఈ క్రమంలో HCL టెక్నాలజీస్ జూలై-సెప్టెంబర్ క్వార్టర్ లో కొత్తగా 10,400 మంది ఫ్రెషర్లను నియమించుకుంటున్నట్లు ప్రకటించింది. ఉద్యోగుల వలసల సమస్యను టీసీఎస్, యాక్సెంచర్ వంటి దిగ్గజ కంపెనీలు సైతం భారీగానే ఎదుర్కొంటున్నాయి.
రాబోయే నెలల్లో మార్జిన్లను మెరుగుపరచడానికి కంపెనీ వినూత్న ధరలను, రేటు పెంపుదల, నిర్వహణ వ్యయాల ఆప్టిమైజేషన్ను అమలు చేస్తుందని హెచ్సrఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సి. విజయకుమార్ చెప్పారు. దీని వల్ల పెరిగిన టాలెంట్ ఖర్చులు, పరివర్తన ఖర్చుల కారణంగా సేవల వ్యాపారంలో మార్జిన్లు ఒత్తిడి తగ్గించటానికి ఈ చర్యలు ఉపకరిస్తాయని ఆయన వెల్లడించారు.
ఉద్యోగుల సంఖ్య ఇలా..
జూన్ 30 నాటికి HCL టెక్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 210,966 మందిగా ఉంది. IT మేజర్ 2022 ఏప్రిల్- జూన్ మధ్య 2,089 మంది సిబ్బందిని కొత్తగా నియమించుకుంది. ఇవి కాకుండా.. FY23లో 30,000-35,000 కంటే ఎక్కువ మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. జూలై-సెప్టెంబర్ 2022 మధ్యకాలంలో 10,400 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని కంపెనీ యోచిస్తోందని కంపెనీ ప్రతినిధి అప్పారావు వెల్లడించారు.
జీతాల పెంపుపై..
జీతాల పెంపు గురించి వెల్లడిస్తూ.. జూలై 1 నుంచి పెంపుదల అమలులోకి వచ్చినందున రాబోయే వారాల్లో వివరాలను తెలియజేస్తామని కంపెనీ తెలిపింది. మునుపటి సంవత్సరంలో 44,000 మంది ఉద్యోగులకు నైపుణ్యం కల్పించినందున HCL దాదాపు రెండు మిలియన్ గంటల అప్ స్కిల్ శిక్షణను నిర్వహించినట్లు వెల్లడించింది. త్వరలోనే వేల సంఖ్యలో అందుబాటులోకి రానున్న మరిన్ని కొలువలు గురించి సమాచారం తెలుసుకునేందుకు కంపెనీ వెబ్ సైట్ లో తెలుసుకోండి.
కంపెనీ లాభాలు ఇలా..
మెుదటి క్వార్టర్ లో కంపెనీ రూ.3,283 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇది గత సంవత్సరం ఇదే క్వార్టర్ కాలానికి సంబంధించిన లాభంతో పోల్చితే 2.4 శాతం ఎక్కువని కంపెనీ తెలిపింది. మార్చి క్వార్టర్ లో కంపెనీ లాభాలు రూ.3,593 కోట్లుగా ఉన్నాయి. అంటే ఈ త్రైమాసికంగా 8 శాతానికి పైగా లాభాల్లో క్షీణత నమోదైంది.