సరికొత్త రికార్డును తాకిన HCL టెక్, కొత్తగా 20,000 ఉద్యోగాలు
బెంగళూరు: HCL టెక్ ఆదాయం 10 బిలియన్ డాలర్ల మార్కును క్రాస్ చేసి, విప్రోను దాటవేసింది. ఈ ఐటీ దిగ్గజం శుక్రవారం డిసెంబర్ త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. ప్రాఫిట్ దాదాపు 27 శాతం పెరిగి రూ.3,982 కోట్లకు చేరుకుంది. ఈ కంపెనీ మరో గుడ్ న్యూస్ కూడా చెప్పింది. రానున్న రెండు త్రైమాసికాల్లో 20,000 మంది ఉద్యోగులను చేర్చుకోనున్నట్లు సీఈవో విజయ్ కుమార్ తెలిపారు. ఇటీవల టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ కంపెనీలు 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను మూడో త్రైమాసికం ఫలితాలను ప్రకటించాయి. ఐటీ కంపెనీలు అన్ని ఫలితాల్లో అదరగొట్టాయి.
అంచనాలకు మించి
HCL టెక్ అంచనాలకు మించి రాణించింది. డిసెంబర్ త్రైమాసికంలో సంస్థ రూ.3,982 కోట్ల లాభాలు గడించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో రూ.3,142 కోట్లతో పోలిస్తే 26.7 శాతం అధికం. డిజిటల్ సేవల డిమాండ్ పెరగడం హెచ్సీఎల్ టెక్కు కలిసి వచ్చింది. కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 6.4 శాతం ఎగబాకి రూ.19,302 కోట్లుగా నమోదయింది. గత ఏడాది ఇదే సమయంలో రూ.18,135 కోట్లుగా ఉంది. ప్రస్తుత త్రైమాసికంలో ఆదాయంలో వృద్ధి 2 శాతం నుండి 3 శాతం మధ్యలో ఉంటుందని అంచనాలు వేసింది.
డివిడెండ్
డిజిటల్, ప్రొడక్ట్స్, ప్లాట్ఫామ్ విభాగాల్లో పటిష్ఠమైన పనితీరు మంచి ఫలితాలకు దోహదపడినట్లు కంపెనీ తెలిపింది. ముందుముందు త్రైమాసికాల్లో వ్యాపారం మరింత పుంజుకోనుందని ధీమా వ్యక్తం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూలై-సెప్టెంబర్ త్రైమాసికంతో పోల్చినా కంపెనీ మెరుగైన పనితీరును కనబర్చింది. ప్రతి షేర్ పైన రూ.4 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది HCL టెక్.
20,000 ఉద్యోగాలు
రానున్న రెండు త్రైమాసికాల్లో భారీగా ఉద్యోగులను నియమించుకోనున్నట్లు హెచ్సీఎల్ టెక్నాలజీస్ తెలిపింది. గత ఏడాది కరోనా వల్ల నియామకాలు తగ్గాయి. వచ్చే ఆరు నెలల్లో 20 వేలమందిని రిక్రూట్ చేసుకుంటామని ప్రకటించింది. హెచ్సీఎల్ గత ఏడాది 10 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటింది. ఈ సంస్థలో 1,59,682 మంది ఉద్యోగులు ఉన్నారు. గత త్రైమాసికంలో మొత్తంగా 12,422 మందిని రిక్రూట్ చేసుకుని నికరంగా 6,597 మందిని తీసుకుంది. గడిచిన ఏడాది కాలంలో వలసలు 10.2 శాతంగా ఉన్నాయి. డిమాండ్ దృష్ట్యా ఫ్రెషర్స్, నైపుణ్యం కలిగిన మరో 20 వేల మందిని రిక్రూట్ చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. అమెరికాలోని తమ ఉద్యోగుల్లో 70 శాతం మంది స్థానికులే అని తెలిపారు.