HCL Jobs: ఇంటర్ పాస్ అయితే ఐటీ ఉద్యోగం.. విద్యార్థులకు HCL అవకాశం.. జీతం ఎంతంటే..
HCL TechBee Programme: 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను డెవలపర్లుగా మార్చాలని ఆరేళ్ల క్రితం హెచ్సీఎల్ టెక్నాలజీస్ కలలు కంది. టైర్-2, టైర్-3 నగరాల్లో విద్యార్థులను ప్రోగ్రామర్లుగా మార్చేందుకు శిక్షణనిచ్చే కార్యక్రమాన్ని కంపెనీ ప్రారంభించింది. ఆరేళ్ల క్రితం 80 మంది విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత సంవత్సరం 4,000 మందిని ఈ ప్రోగ్రామ్ కింద సిద్ధం చేయగా.. ఈ ఏడాది 8,000 మందిని, వచ్చే ఏడాది 15,000 విద్యార్థులకు అవకాశం కల్పిస్తోంది. ఈ ఏడాది కంపెనీ అనుకున్న నికర నియామకాల్లో ఇది 20 శాతంగా ఉంది.
స్టూడెంట్స్కు శిక్షణ ఇలా..
ప్రోగ్రామర్లు ప్రస్తుతం క్లౌడ్ ఇంజినీరింగ్, డిజిటల్ ఇంజనీర్లుగా మారుతున్నారని HCL టెక్నాలజీస్ హెచ్ఆర్ హెడ్ అప్పారావు వెల్లడించారు. ప్రస్తుతం ఐటీ కంపెనీలు యువ ప్రతిభను వెలికితీస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రతిభకు భారీ కొరత ఉన్న మార్కెట్లో ఈ కార్యక్రమం HCLకి అంకితమైన, స్థిరమైన ప్రతిభను అందిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రోగ్రామ్ను టెక్బీ అని అంటారు. ఈ ప్రోగ్రామ్ లో ఆరు నెలల క్లాస్ రూమ్ శిక్షణతో పాటు, ఆరు నెలల ఉద్యోగ శిక్షణ ఉంటుంది.
ఉద్యోగంతో పాటు చదువు కూడా..
ఈ శిక్షణ తర్వాత అభ్యర్థులు వివిధ ప్రాజెక్ట్లలో ఉంచబడతారు. దీనితో పాటు వారు హెచ్సిఎల్తో భాగస్వామ్యం ఉన్న సంస్థల నుంచి గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లకు కూడా ప్రవేశం పొందుతారు. వీటిలో.. BITS పిలానీ, శాస్త్ర, అమిటీ, IIM నాగ్పూర్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు ఉన్నాయి. వీటిలో తరగతులు వారాంతాల్లో జరుగుతాయి. అంటే ఉద్యోగంతో పాటు చదువు కూడా ఏకకాలంలో పూర్తి చేసుకోవచ్చు.
శాలరీ ప్యాకేజ్ వివరాలు..
HCL ఉద్యోగ-శిక్షణ సమయంలో విద్యార్థులకు నెలకు రూ.10,000 చెల్లిస్తుంది. ఉద్యోగంలో చేరిన మొదటి సంవత్సరంలో సంవత్సరానికి 2.5 లక్షల జీతాన్ని అందిస్తోంది. రెండవ సంవత్సరంలో సగటు తాజా జీతం రూ.3.5 లక్షలకు పెంచబడుతుంది. వివిధ యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లకు కూడా కంపెనీనే చెల్లిస్తుంది. దీనికి బదులుగా అభ్యర్థి గ్రాడ్యుయేషన్ తర్వాత రెండు సంవత్సరాల పాటు HCL కంపెనీలోనే పని చేయాల్సి ఉంటుంది.
ఎంపిక..
విద్యార్థులను ఆప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలో ఇంగ్లిష్, గణితం నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఈ విద్యార్థులు ప్రోగ్రామ్ కోసం మొదట లక్ష రూపాయలు చెల్లించాలి. కానీ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు చొరవ తీసుకుని ఈ మొత్తాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా చెల్లిస్తున్నాయి. మార్కెట్లో భారీగా ఉన్న ఉద్యోగుల కొరతను తీర్చేందుకు ఈ నియామకాలు తమకు మంచి ఫలితాలను అందిస్తాయని హెచ్ఆర్ అప్పారావు వెల్లడించారు.