ట్రంప్ దెబ్బ, ఇండియన్ ఐటీ కంపెనీలకు రూ.1,200 కోట్ల భారం
ట్రంప్ ప్రభుత్వం హెచ్1బీ వీసాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా అమెరికాలోని యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకు అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం వేలాది మంది మన దేశం నుండి ఈ వీసాలపై అమెరికా వెళ్తారు. అయితే డిసెంబర్ 2020 వరకు వీటిని నిలిపివేయడంతో మన దేశానికి చెందిన ఐటీ కంపెనీలపై పెను భారం పడుతుందని క్రిసిల్ రేటింగ్ ఏజెన్సీ అంచనా వేసింది. ఇప్పటికే కరోనా కారణంగా దెబ్బతిన్న ఐటీ రంగానికి ఇది మరింత భారం కానుంది.
ఐటీ రంగానికి ఊహించని దెబ్బ: ఈసారి నష్టపోయినా... కంపెనీల ఆశ అదే
రూ.1,200 కోట్ల భారం
హెచ్1బీ వీసాల రద్దుతో ఇండియన్ ఐటీ సంస్థలపై రూ.1,200 కోట్ల మేరకు భారం పడనుందని, దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో(2020-21) ఐటీ సంస్థల లాభాలు 0.25% నుంచి 0.30% వరకు తగ్గవచ్చునని క్రిసిల్ అంచనా వేసింది. భారత ఐటీ కంపెనీలకు అతిపెద్ద మార్కెట్ అమెరికా. ట్రంప్ వచ్చాక ఉద్యోగులకు సంబంధించి లోకలైజేషన్ క్రమంగా పెరుగుతోంది. కొన్నేళ్లుగా హెచ్1బీ వీసాలు తగ్గించి, స్థానిక ఉద్యోగులను తీసుకుంటున్నాయని, ఈ ముందస్తు చర్య కారణంగా ప్రభావం కాస్త తక్కువగా ఉండవచ్చునని తెలిపింది.
కరోనా దెబ్బకు హెచ్1బీ అదనం
కరోనా కారణంగా ఇప్పటికే ఐటీ సంస్థల లాభాల్లో పెద్ద ఎత్తున ప్రభావం ఉంటుందని క్రిసిల్ అంచనా వేసింది. ఈ మహమ్మారి వల్ల ఆర్థిక సంవత్సరంలో మన ఐటీ సంస్థల లాభాలకు 2.5 శాతం గండిపడవచ్చునని తెలిపింది. హెచ్1బీ వీసాల రద్దు భారం దీనికి అదనమని పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 15 టాప్ పర్ఫార్మెన్స్ కంపెనీల ఆపరేషనల్ ప్రాఫిటబులిటీ 23 శాతం మేర ఉంటుందని అంచనా వేసింది.
ఇధి కొంత ఉపశమనం
హెచ్1బీ, ఎల్1 వీసాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ ఇండియన్ ఐటీ కంపెనీలు ఇప్పటికే స్థానిక ఉద్యోగులను నియమించుకుంటున్నాయని, తద్వారా వీసాలపై ఆధారపడటం తగ్గించడం కాస్త ఉపశమనం అని అభిప్రాయపడింది. వీసాల తిరస్కరణ రేటు 2016లో ఆరు శాతం నుండి ఇప్పుడు 39 శాతానికి పెరిగాయి. ఇది లోకలైజేషన్కు దారి తీసింది. దీంతో స్థానిక ఉద్యోగులు పెరిగారు.
అధిక జీతంతో స్థానికులతో భర్తీ
కరోనా కారణంగా తలెత్తిన నిరుద్యోగ సమస్యను ఎదుర్కొనేందుకు ట్రంప్ ప్రభుత్వం డిసెంబర్ వరకు కొత్త హెచ్1బీ, ఎల్1 వీసాల జారీని నిలిపివేసింది. ఈ మేరకు గత నెలలో ప్రకటన చేసింది. దీంతో ఈ వీసాలపై భారత ఐటీ నిపుణుల్ని అమెరికా తీసుకెళ్లి, అక్కడి తమ ఐటీ యూనిట్లలో పని చేయించుకునే అవకాశం లేదు. అవసరమైన ఉద్యోగులను 25 శాతం అధిక జీతాలతో స్థానికులతో భర్తీ చేయక తప్పని పరిస్థితి కంపెనీలకు ఏర్పడింది.