జీఎస్టీ రిటర్న్ లు ఫైల్ చేయలేదా? అయితే ముప్పు పొంచి ఉన్నట్టే!
వ్యాపారం నిర్వహిస్తున్న వారిలో చాలా మంది తమ వ్యాపార లావాదేవీలకు సంబంధిచిన రిటర్న్ ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పలు మార్లు పన్ను అధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన వాటిని లెక్క చేయడం లేదు. రిటర్న్ లు సమర్పించకుంటే ఏమవుతుందన్న లెక్కలేని తనం చాలా మందిలో కనిపిస్తోంది. దీన్ని గమనించిన పన్ను శాఖ మరింత కఠినంగా వ్యవహరించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా వారి రిజిస్ట్రేషన్ ను రద్దు చేయాలన్న యోచన చేస్తోంది. ఈ విషయంలో వెనక్కి తగ్గవద్దని భావిస్తున్నట్టు సమాచారం.
20 శాతం ఫైల్ చేయడం లేదు
వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు వ్యాపారులకు రిటర్న్ ల విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. అయితే వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కొన్ని మినహాయింపులను ఇచ్చింది. పన్ను రిటర్న్ లను సమర్పించే ఫారాల్లోనూ కొన్ని మార్పులు చేర్పులు చేసింది. అయినప్పటికీ రిటర్న్ లను సమర్పించడంలో కొంతమంది. నిర్లక్ష్యం వహిస్తున్నారు. అందుకే కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ (సి బీ ఐ సి ) బోర్డు మరింత కఠినంగా వ్యవహరించాలనుకుంటుంది.
* పన్ను బాధ్యతను అంచనా వేయడానికి, పన్నుల చెల్లింపులను తెలుసుకోవడానికి రిటర్న్ లు దోహద పడతాయి. కానీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ రిటర్న్ లు సమర్పించని వారు దాదాపు 20 శాతం మంది ఉంటున్నారు. దీనివల్ల జీఎస్టీ వసూళ్లు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని నెలలపాటు రిటర్న్ లను సమర్పించకుండా ఉన్న వారి రిజిస్ట్రేషన్ ను రద్దు చేయాలను కుంటున్నారని తెలిసింది.
* రిజిస్ట్రేషన్ రద్దు చేసినా పన్ను చెల్లింపు బాధ్యత మాత్రం తగ్గదు.
చట్ట ప్రకారం ఇలా..
* జీఎస్టీ చట్ట ప్రకారం సాధారణ సరఫరా ధరలు నెలవారీగా లేదా త్రైమాసికం వారీగా (కంపోజిట్ స్కీం ఎంచుకున్న సప్లయర్) రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ నిర్దేశిత నెలలో క్రెడిట్ డిస్ట్రిబ్యూషన్ వివరాలతో నెలవారీగా రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.
* వ్యక్తుల మూలం వద్ద పన్ను మినహాయించుకోవడంతో పాటు పన్ను వసూలు చేయాలి. ఈ మేరకు నెలవారీ రిటర్న్ లో ఈ వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది.
తగ్గుతున్న వసూళ్లు..
* జీఎస్టీ వసూళ్లు ప్రభుత్వం అంచనా వేసినదానికన్నా తక్కువగా ఉంటున్నాయి.
* గడచినా ఆక్టోబర్ నెలలో జీటీ వసూళ్లు 95,380 కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే పన్ను వసూళ్లు 5.29 శాతం తక్కువ. వరుసగా మూడో నెలలో కూడా జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల రూపాయలకన్నా తక్కువగానే ఉండటం వల్ల ప్రభుత్వ వర్గాలు అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది.
* ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - అక్టోబర్ మధ్య కాలంలో జీఎస్టీ వసూళ్లు 3.38 శాతం మేర పెరిగాయి.