జీఎస్టీతో పన్ను రేట్లు తగ్గాయ్, 4 ఏళ్లలో 66 కోట్ల రిటర్న్స్ ఫైల్ చేశారు
జీఎస్టీ(గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్) వల్ల సంక్లిష్టంగా ఉన్న పరోక్ష పన్ను విధానం సరళంగా మారడంతో పాటు వస్తువులపై పన్ను రేట్లు తగ్గాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. నాలుగేళ్లలో 66 కోట్ల జీఎస్టీ రిటర్న్స్ దాఖలైనట్లు తెలిపారు. జీఎస్టీ విధానం అమలులోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె బుధవారం (జూలై 30) వరుస ట్వీట్లు చేశారు.
జీఎస్టీ రాకముందు ఎక్సైజ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్, మరో పదమూడు రకాల సెస్లు కలిపి మొత్తం 17 రకాల ట్యాక్స్లు ఉండేవన్నారు. 2017 జులై 1 నుండి ఇవన్నీ మాయమైపోయాయన్నారు. జీఎస్టీ విధానం అటు వ్యాపారులకు, ఇటు కస్టమర్లకు మేలు చేకూరుస్తోందన్నారు. జీఎస్టీ విధానం సరళతరం కావడం వల్ల నిబద్ధత పెరిగిందన్నారు. సుమారు 66 కోట్ల జీఎస్టీ రిటర్న్స్ ఈ 4 ఏళ్లలో దాఖలయ్యాయన్నారు. ఇంతకుముందు వ్యాపారులు 495 రకాల దరఖాస్తులు చేసేవారని, జీఎస్టీతో అవి 12కి తగ్గాయన్నారు.
జీఎస్టీలో ప్రస్తుతం నాలుగు స్లాబ్స్ ఉండగా, అత్యవసర వస్తువులపై ఐదు శాతం పన్ను రేటు అమలవుతోందన్నారు. కార్ల వంటి విలాసవంతమైన వస్తువులపై 28 శాతం పన్ను రేటు వర్తిస్తోందన్నారు. 12 శాతం, 18 శాతం పన్ను రేట్ల కింద వివిధ వస్తువులు ఉన్నాయన్నారు. జీఎస్టీకి ముందు పన్ను మీద పన్ను వల్ల 31 శాతం వరకు పన్ను పడేదన్నారు. జీఎస్టీతో పన్ను రేటు తగ్గిందన్నారు.