GST Council Meeting: మరిన్ని అప్పులు చేస్తాం..అనుమతివ్వండి: కేసీఆర్ సర్కార్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజూ మూడున్నర నుంచి నాలుగు వేల మంది మృత్యువాత పడుతున్నారు. కొత్తగా 3,617 మంది పేషెంట్లు కరోనాకు బలి అయ్యారు. కంటికి కనిపించని ఈ మహమ్మారి వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్డౌన్లోకి జారుకున్నాయి. సంపూర్ణ లాక్డౌన్ను అమలు చేస్తోన్నాయి. ఈ పరిణామాలతో ఆయా రాష్ట్రాల ఆర్థిక వనరులు దెబ్బతిన్నాయి. రాబడి క్షీణించింది. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా మినహాయింపు కాదు. ఈ పరిణామాల మధ్య ఏర్పాటైన 43వ జీఎస్టీ సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.
ITR filing: ఇంకా ఈజీ: కొత్త పోర్టల్ అందుబాటులోకి: పేమెంట్ ఆప్షన్లు కూడా
తెలంగాణ తరఫున ఆర్థికమంత్రి
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలో దేశ రాజధానిలో ముగిసిన వస్తు, సేవా పన్ను కౌన్సిల్ ( 43rd GST Cuncil meeting) 43వ సారి భేటీలో తెలంగాణ ప్రభుత్వం కొన్ని కీలక అంశాలను ప్రస్తావించింది. తెలంగాణ మంత్రి తన్నీరు హరీష్ రావు ఇందులో పాల్గొన్నారు. బూర్గుల రామకృష్ణారావు భవన్లోని తన ఛాంబర్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ఈ భేటీకి హాజరయ్యారు. కరోనా వైరస్ మిగిల్చిన సంక్షోభ పరిస్థితుల్లో తమ ప్రభుత్వం ఏదుర్కొంటోన్న ఆర్థిక పరిస్థితులను ఏకరువు పెట్టారు.
రుణ పరిమితిని పెంచుకోవడానికి అవకాశం..
ఆర్థిక లోటును భర్తీ చేసుకోవడానికి ఉద్దేశించి.. కేంద్రం రాష్ట్రాలకు విధించిన రుణాల పరిమితిని పెంచాలని హరీష్ రావు విజ్ఙప్తి చేశారు. ఎఫ్ఆర్బీఎం చట్టం కింద ప్రస్తుతం తాము రాష్ట్రం తరఫున రుణాలను తీసుకోవడానికి మూడుశాతం వరకు మాత్రమే అనుమతి ఉందని, దీన్ని అయిదు శాతానికి పొడిగించాలని ఆయన కోరారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ఆర్థికలోటు 36.3 శాతంగా నమోదైందని గుర్తు చేశారు. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఆర్థికలోటు 23.10 శాతం మేర నమోదవుతుందని అంచనా వేసినట్లు వివరించారు.
218 కోట్లు మాత్రమే
ఆర్థికలోటుకు తోడుగా కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ బకాయిల మొత్తం కూడా అతి తక్కువగా అందుతోందని హరీష్ రావు చెప్పారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ముగిసిన 2020-2021 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి తమ రాష్ట్రానికి 2,638 కోట్ల రూపాయల మేర ఐజీఎస్టీ అందిందని, అదే సమయంలో తెలంగాణ వాటాగా 13,000 కోట్ల రూపాయలు ఐజీఎస్టీ ఫండ్కు చేరిందని చెప్పారు. అయినప్పటికీ దీని రూపంలో ఈ ఏడాది ఇప్పటిదాకా 218 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రం విడుదల చేసిందని, మిగిలిన మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు.
రెవెన్యూ లోటుకు తోడు..
ఒకవంక రెవెన్యూ తగ్గడం, మరోవంక కరోనా వైరస్ను కట్టడి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, వ్యాక్సిన్ల కొనుగోలు, కోవిడ్ పేషెంట్లకు సౌకర్యాల కల్పన వంటి చర్యలపై అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని హరీష్ రావు. ఈ పరిస్థితులుల ఎఫ్ఆర్బీఎం చట్టం కింద అప్పులు తీసుకోవడానికి ఉద్దేశించిన పరిమితిని మూడు నుంచి అయిదు శాతానికి పెంచాలని కోరారు. పెట్రోల్, డీజిల్, మద్యం అమ్మకాలు, ఎక్సైజ్ అనుబంధ వస్తువులపై మినహా మిగిలిన అన్ని రకాలపై జీఎస్టీ అమల్లో ఉండటం వల్ల కేంద్ర ప్రభుత్వం అత్యధిక ఆదాయాన్ని పొందుతోందని, అదే స్థాయిలో రాష్ట్రాలకు వాటిని బదలాయించట్లేదని తేల్చిచెప్పారు.