కోవిడ్ 19 డ్రగ్స్ పైన రాయితీ డిసెంబర్ 31 వరకు పొడిగింపు
జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) కౌన్సిల్ 45వ సమావేశం నేడు (సెప్టెంబర్ 17) ప్రారంభమైంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో ప్రారంభమైన ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య అధికారులు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థికమంత్రులు పాల్గొన్నారు. దాదాపు ఇరవై నెలల తర్వాత కౌన్సిల్ సమావేశం మళ్లీ ప్రత్యక్ష పద్ధతిలో జరుగుతోంది. కరోనా నేపథ్యంలో 2019 డిసెంబర్ 18వ తేదీ తర్వాత జీఎస్టీ మండలి సమావేశాలు వర్చువల్గా నిర్వహించారు.
పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చే అంశం ప్రధాన అజెండాగా నేటి సమావేశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చే విషయమై జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకోవాలని గత జూన్ నెలలో కేరళ హైకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై చర్చించే అవకాశముందని భావిస్తున్నారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల ధరల్లో సగాని కంటే ఎక్కువగా పన్నులే ఉన్నాయి.
దీంతో కరోనా ఔషధాలు, మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వంటి వాటిపై పన్ను మినహాయింపును కొనసాగించే అంశంపై చర్చిస్తారని మొదటి నుండి భావించారు. ఈ మేరకు పదకొండు కోవిడ్ 19 డ్రగ్స్ పైన కన్సెషన్ను డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించింది జీఎస్టీ కౌన్సిల్. కోవిడ్ 19 డ్రగ్స్ పైన 12 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గిస్తూ గతంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ తగ్గింపును డిసెంబర్ 31 వరకు పొడిగించింది.
ఈ డ్రగ్స్లో ఇటోలిజుమాబ్, పోసాకోనాజోల్, ఇన్ఫ్లిక్సిమ్యాబ్, బామ్లానివిమ్యాబ్ అండ్ఎటెసెవిమ్యాబ్, కాసిరివిమ్యాబ్ అండ్ ఇమ్దేవిమ్యాబ్, 2 డియోక్సీ డీ గ్లౌజ్, ఫెవిపిరవిర్ తదితరాలు ఉన్నాయి. అంతకుముందు వీటి పైన కన్సెషన్ను సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఇచ్చారు. ఇప్పుడు దీనిని మరో మూడు నెలలు పొడిగించారు. మెడిసిన్స్ అంఫోటెరిసిన్ బీ(5 శాతం టు నిల్), టోసిలిజుమ్యాబ్ (5 శాతం టు నిల్), రెమ్దెసివిర్ (12 శాతం టు 5 పర్సెంట్), హెపారిన్ (12 శాతం టు 5 శాతం) వంటి యాంటీ కోగులాంట్స్.
ఇదిలా ఉండగా, భారత్లో కరోనా వ్యాక్సీన్ కార్యక్రమం దూసుకెళ్తోంది. ఇప్పటికే కోటి డోస్లు అందించి, రెండు కోట్ల మార్కు దిశగా వెళ్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా వ్యాక్సీన్ వేయించుకొని ఆయనకు కానుకగా ఇవ్వాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. వ్యాక్సీన్ తీసుకొని, ఇతరులకు స్లాట్స్ బుక్ చేసి వ్యాక్సీన్ సేవ చేద్దామని కేంద్ర ఆరోగ్యమంత్రి మాండవీయ ట్వీట్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం సమయానికి కోటి వ్యాక్సీన్ డోసులు పంపిణీ అయ్యాయి. ఈ లెక్కన నిమిషానికి 42 వేల మందికి వ్యాక్సీన్ వేసినట్లు నేషనల్ హెల్త్ అథారిటీ చీఫ్ ఆర్ఎస్ శర్మ్ కూడా ట్వీట్ చేశారు. అలాగే కోటి మార్కును దాటడం నెల వ్యవధిలో ఇది నాలుగోసారి. మోడీ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు రెండు కోట్ల మందికి వ్యాక్సీన్ ఇచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. అలాగే ఈ రోజు నుండి ఇరవై రోజుల పాటు ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది.