జీఎస్టీ పరిహారం: కేంద్రమే రుణాలు తీసుకొని రాష్ట్రాలకు ఇస్తే బెట్టర్!
జీఎస్టీ పరిహారం చెల్లింపులో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం రెండు ఆప్షన్స్ ఇచ్చింది. ఒకటి రాష్ట్రాలకు పరిహారంగా ఇచ్చే రూ.97 వేలకోట్ల మొత్తాన్ని ఆర్బీఐ నుండి ప్రత్యేక విండో ద్వారా కేంద్రం సమకూర్చడం, రెండోది ఆర్బీఐ ద్వారా రూ.2.65 లక్షల కోట్ల రుణాల సేకరణ జరిపి కేంద్రం తగిన సహకారం అందిస్తుంది. ఈ ఆప్షన్లపై వారం రోజుల్లో అభిప్రాయం చెప్పాలని కోరింది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కేంద్ర రుణాల ద్వారానే రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం సరైనదిగా భావించవచ్చు.
ముఖేష్ అంబానీ కంటే ఎక్కువ, అత్యధిక శాలరీ ఈ దంపతులదే! కూతురుకు కోట్ల శాలరీ
కేంద్రమే రుణాలు తీసుకొని ఇస్తే బెట్టర్
కేంద్రమే రుణాలు తీసుకొని, రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం అందించే అంశానికే ఆర్బీఐ ప్రాధాన్యత ఇవ్వవచ్చును. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం రుణాల కోసం ప్రత్యేక యంత్రాంగం అవసరమని, కేంద్రమే రుణాలు తీసుకుంటే ఈ ప్రత్యేక మెకానిజం అవసరం లేదని ఆర్బీఐ భావించవచ్చునని అంటున్నారు. కరోనా కారణంగా ఆదాయాలు పడిపోయినందున తక్షణమే జీఎస్టీ పరిహారం చెల్లించాలని గురువారం జరిగిన 41వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు రాష్ట్రాలు కోరాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రం రెండు మార్గాలను రాష్ట్రాల ముందు ఉంచింది.
రెండు మార్గాలు..
జీఎస్టీ పరిహారం చెల్లింపులో కొన్ని న్యాయపరమైన అంశాలు ఇమిడి ఉండటంతో అటార్నీ జనరల్ సలహా కోరినట్లు జీఎస్టీ కౌన్సిల్లో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి తెలిపారు. చట్టం ప్రకారం 2017 జూలై నుండి 2022 జూన్ వరకు రాష్ట్రాలకు 14 శాతం ఆధాయ వృద్ధిని సంరక్షిస్తూ పరిహారం చెల్లించాలని అటార్నీ జనరల్ స్పష్టం చేశారు. పరిహార మొత్తాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి సెస్ నిధి ద్వారా సమకూర్చాలని, సంఘటిత నిధి నుండి తీసుకోకూడదని చెప్పారన్నారు. ఈ పరిస్థితుల్లో రెండు మార్గాలు రాష్ట్రాల ముందు పెట్టారు. ఒకటి.. రాష్ట్రాలకు ఇచ్చే పరిహారం రూ.97వేల కోట్లు. ఆర్బీఐ నుండి ప్రత్యేక విండో ద్వారా కేంద్రం సమకూర్చడం. రెండోది.. ఆర్బీఐ ద్వారా రూ.2.65 లక్షల కోట్ల రుణాల సేకరణ, ఇందుకు కేంద్రం తగిన సహకారం అందిస్తుంది.
మొదటి మార్గం ఇదీ..
జీఎస్టీ అమలు వల్ల ఏర్పడిన రూ.97వేల కోట్ల నష్టాన్ని ఆర్బీఐతో సంప్రదించి స్పెషల్ విండో ద్వారా రాష్ట్రాలకు అందించే ఏర్పాటు చేస్తుంది కేంద్రం. వడ్డీతో ఈ మొత్తాన్ని 2022 జూలై తర్వాత పరిహార సెస్ నిధి నుండి చెల్లిస్తుంది. కేంద్రం ఆర్బీఐని సంప్రదించి రాష్ట్రాలకు రుణం ఇప్పిస్తుంది. అప్పుడు రాష్ట్రాలు మార్కెట్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆత్మనిర్భర్ భారత్ కింద ఇదివరకు ప్రకటించిన 0.5 శాతానికి ఇది అదనం. ఈ మొదటి మార్గాన్ని ఎంచుకుంటే 2022 జూన్ వరకు రావాల్సిన పరిహారానికి రక్షణ ఉంటుంది. ఆ మొత్తాన్ని 2022 తర్వాత పొందవచ్చు. ఆ తర్వాత కూడా సెస్ నిధి కొనసాగుతుంది. ఇప్పుడు మార్కెట్ నుండి క్కువ మొత్తం పొందిన వారికి 2022 తర్వాత సెస్ నుండి పరిహారం అందిస్తారు.
రెండింటిలోను రాష్ట్రాలు చెల్లించక్కరలేదు
రాష్ట్రాలకు కేంద్రం చూపించిన రెండో మార్గం రూ.3 లక్షల కోట్ల రెవెన్యూ నష్టంలో సెస్ కింద వసూలయ్యే రూ.65వేల కోట్లు పోను మిగిలిన రూ.2.65 లక్షల కోట్లను రాష్ట్రాలు ఆర్బీఐ ద్వారా సేకరించాలి. దీనికి కేంద్రం సహకారం ఉంటుంది. దీనిని ఎంచుకుంటే ఎఫ్ఆర్బీఎంలో 0.5 శాతం అదనపు వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు అధిక మొత్తం రుణంగా పొందిన రాష్ట్రాలకు 2022 తర్వాత సెస్ నిధి నుండి పరిహారం పెంపు ఉండదు. ఈ రెండింట్లో రాష్ట్రాలు దేనిని ఎంచుకున్నా ఆ మొత్తాన్ని రాష్ట్రాలు చెల్లించవు. పూర్తిగా పరిహార సెస్ నుండి చెల్లిస్తారు. కేంద్రం ఇచ్చిన ఆప్షన్ ప్రకారం రాష్ట్రాలకు రుణాలు ఇచ్చేందుకు స్పెషల్ విండోకు ఆర్బీఐ ఆసక్తి చూపించకపోవచ్చునని నిపుణులు చెబుతున్నారు.