ఆ కారణంతో రికార్డ్ జీఎస్టీ కలెక్షన్స్, మార్చిలో రూ.1.24 లక్షల కోట్లు
మార్చి 2021లో జీఎస్టీ వసూళ్లు రికార్డుస్థాయిని తాకాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి నెలలో ఏకంగా రూ.1.24 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాలు విడుదల చేసింది. అంతక్రితం ఏడాది వసూలైన జీఎస్టీ వసూల్లతో పోలిస్తే ఇది 27 శాతం అధికం. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఒక నెలలో ఇంతటిస్థాయిలో పన్నులు వసూలు కావడం కూడా ఇది తొలిసారి. గత ఆరు నెలలుగా లక్ష కోట్ల రూపాయలకు పైగా జీఎస్టీ వసూళ్లు వస్తున్నాయి. కరోనా మహమ్మారి నుండి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుండటంతో జీఎస్టీ కలెక్షన్స్ పెరిగాయి.
హైదరాబాద్లో బిట్ కాయిన్ కంపెనీ కార్యాలయం, ప్రభుత్వం నిషేధిస్తుందా?
పూర్తి సంవత్సరానికి 7% తక్కువ
కరోనా మహమ్మారి తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటోందనేందుకు ఈ జీఎస్టీ పన్ను వసూళ్లు నిదర్శనమని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. మార్చిలో వసూలైన రూ.1,23,902 కోట్లలో సెంట్రల్ జీఎస్టీ కింద రూ.22,973 కోట్లు, ఎస్-జీఎస్టీ కింద రూ.29,329 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.62,842 కోట్లు, సెస్ రూపంలో రూ.8,757 కోట్లు వసూలయ్యాయి.
కరోనా కారణంగా గత ఆర్థిక సంవత్సరం (2020-21) మొదటి ఆరు నెలలు జీఎస్టీ వసూళ్లు భారీగా క్షీణించాయి. రికవరీ నేపథ్యంలో క్రమంగా పెరుగాయి. ఆరు నెలలుగా రూ.1 లక్ష కోట్లు దాటుతున్నాయి. ఇటీవల కొత్త రికార్డులు నమోదవుతుండటంతో FY21 పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీఎస్టీ వసూళ్లలో క్షీణత కేవలం 7 శాతం మాత్రమే ఉంది.
అందుకే రికార్డ్ కలెక్షన్స్
రికవరీ పెరగడంతో ఫిబ్రవరి నెలలో సేల్స్ పెరిగాయి. అదే సమయంలో మార్చి నెలలో రిటర్న్స్ ఫైల్ చేశారు. దిగుమతి సుంకాలు పెరిగాయి. ఉత్పత్తుల దిగుమతి ఆదాయం 70 శాతం పెరిగింది. సర్వీస్ ఇంపోర్ట్స్ సహా డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ ఏడాది ప్రాతిపదికన 17 శాతం పెరిగాయి. రికవరీ వేగవంతం, రిటర్న్స్ ఫైల్ చేయడం సహా వివిధ అంశాల నేపథ్యంలో రికార్డ్ కలెక్షన్స్ నమోదయ్యాయి.
తెలుగు రాష్ట్రాల నుండి
త్రైమాసికం పరంగా చూస్తే మార్చి క్వార్టర్లో వసూళ్లు 14 శాతం పెరిగాయి. అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లో 8 శాతం పెరిగాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీఎస్టీ కలెక్షన్లు దారుణంగా పతనం అయ్యాయి. కాగా, తెలంగాణలో రూ.4,166.42 కోట్ల మేర జీఎస్టీ వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏడాది క్రితం ఇదే నెలలో వసూలైన రూ.3,562.56 కోట్లతో పోలిస్తే ఇది 17 శాతం అధికం. అలాగే ఆంధ్రప్రదేశ్లో రూ.2,685.09 కోట్లు వసూలయ్యాయి.