జీఎస్టీ సరికొత్త రికార్డ్, రూ.1.15 లక్షల కోట్లతో ఆల్ టైమ్ హై
డిసెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు సరికొత్తస్థాయిలో నమోదయ్యాయి. ఎప్పుడు లేని విధంగా గత నెలలో రూ.1,15,174 కోట్లు వసూలయ్యాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత నెలవారీ వసూళ్లలో ఇదే అత్యధికం. 2019 ఏప్రిల్ నెలలో రూ.1,13,866 కోట్లు వసూలు కాగా, ఇప్పటి వరకు ఇదే గరిష్టం. ఇప్పుడు వాటిని దాటి, రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. 2019 డిసెంబర్ నెలలోని వసూళ్లతో పోలిస్తే 12 శాతం పెరగడం గమనార్హం. నవంబర్ నెలలో రూ.1,04,963 కోట్లు వసూలయ్యాయి.
కరోనా అనంతరం జీఎస్టీ వసూళ్లు క్షీణించిన విషయం తెలిసిందే. అయితే వరుసగా మూడో నెల రూ.1 లక్ష కోట్లు దాటాయి. జీఎస్టీ వరుసగా లక్ష కోట్ల రూపాయలు దాటడం, రికార్డ్స్థాయిలో నమోదు కావడం.. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందనేందుకు నిదర్శనమని ఆర్థిక శాఖ తెలిపింది. జీఎస్టీ వ్యవస్థలో ఉన్న లోపాలను సవరించడంతో అవకతవకలకు ఆస్కారం తగ్గిందని, వసూళ్లు పెరగడానికి ఇది కూడా దోహదపడిందని చెబుతున్నారు.
డిసెంబర్ నెల వసూళ్లలో సీజీఎస్టీ కింద రూ.21,365 కోట్లు, ఎస్జీఎస్టీ కింద రూ.27,804 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.57,426 కోట్లు వసూలయ్యాయి. సెస్ కింద మరో రూ.8579 కోట్లు వచ్చాయి. ఐజీఎస్టీ నుండి రూ.23276 కోట్లను సీజీఎస్టీ, రూ.17681 కోట్లను ఎస్జీఎస్టీ కింద సర్దుబాటు చేసింది. సర్దుబాట్ల అనంతరం డిసెంబర్ నెలలో కేంద్రానికి రూ.44,641 కోట్లు, రాష్ట్రాలకు రూ.45,485 కోట్ల ఆదాయం వచ్చింది.
చందాదారులకు ఊరట, NPS నుండి ఆన్లైన్ ద్వారా ఎగ్జిట్ కావొచ్చు