GST August 2021: మళ్లీ రూ.లక్షకోట్లు: ఏపీ, తెలంగాణ వాటా ఎంత..రాష్ట్రాలవారీ బ్రేకప్
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి దేశాన్ని ఆవరించుకున్న వేళ.. ఇది వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి రాష్ట్రాలన్నీ తమకు తాముగా ఆంక్షలను విధించుకుని, లాక్డౌన్లోకి జారిపోయిన గడ్డు పరిస్థితుల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా గట్టెక్కుతున్నట్టే కనిపిస్తోంది. వస్తు, సేవా పన్నుల (GST) వసూళ్లపై దాని ప్రభావం పెద్దగా పడనట్టే. ఆశించిన స్థాయిలో జీఎస్టీ కలెక్షన్లు నమోదు అయ్యాయి. వరుసగా రెండోసారి కూడా జీఎస్టీ కలెక్షన్లు లక్షకోట్ల రూపాయలను దాటేశాయి.
హయ్యెస్ట్ నుంచి..
నిజానికి- ఈ ఏడాది ఏప్రిల్లో గరిష్ఠ స్థాయిలో జీఎస్టీ కలెక్షన్లను నమోదైన విషయం తెలిసిందే. లక్షా 40 వేల కోట్ల రూపాయలకు పైగా జీఎస్టీ వసూళ్లు ఆ నెలలో నమోదు అయ్యాయి. అదో రికార్డు. దేశంలో జీఎస్టీ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చిన తరువాత తొలిసారిగా లక్షా 40 వేల కోట్ల రూపాయలను దాటాయి వసూళ్లు. అదే నెలలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ విజృంభించడం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపింది. మే నెలలో దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా లాక్డౌన్లోకి వెళ్లాయి. ఫలితంగా మే నెలలో 1,02,709 కోట్ల రూపాయలుగా జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి.
లోయెస్ట్గా..
జూన్లో ఆ సంఖ్య మరింత ఘోరంగా పడిపోయింది. ఆ నెలలో నమోదైన జీఎస్టీ వసూళ్లు 92,849 కోట్ల రూపాయలు మాత్రమే. ఆ తరువాత మళ్లీ క్రమంగా పుంజుకోవడం ఆరంభించాయి. జులైలో లక్షా 16 వేల కోట్ల రూపాయల మేర జీఎస్టీ కలెక్షన్లు నమోదయ్యాయి. ఆగస్టులోనూ అదే దూకుడు కొనసాగింది. జులైతో పోల్చుకుంటే.. కొంతమేర తగ్గినప్పటికీ.. అది పరిమితంగానే ఉంటోంది. కిందటి నెల నమోదైన జీఎస్టీ కలెక్షన్లు.. 1,12,020 కోట్లుగా రికార్డయింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి కిందటే ప్రకటించింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది.
ఈ నెలల్లో మళ్లీ..
ఈ 1,12,020 కోట్ల మొత్తంలో సెంట్రల్ జీఎస్టీ (CGST) వాటా 20,522 కోట్ల రూపాయలు. కాగా.. స్టేట్ జీఎస్టీ (SGST)-26,605 కోట్ల రూపాయలు. ఇక ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (IGST) రెవెన్యూ మొత్తం 56,247 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇందులో సరుకుల దిగుమతి ద్వారా నమోదైన జీఎస్టీ మొత్తం 26,884 కోట్ల రూపాయలు. వేర్వేరు రంగాలపై విధించిన సెస్ ద్వారా 8,646 కోట్ల రూపాయలు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
గత ఏడాది ఆగస్టు కంటే..
దేశంలోకి దిగుమతి అయ్యే వస్తువులపై విధించిన పన్నుల ద్వారా 646 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి. ఈ మొత్తాన్ని 8,646 కోట్ల రూపాయల్లోనే కలిపేశారు. గత ఏడాది ఆగస్టులో నమోదైన జీఎస్టీ వసూళ్లతో కంపేర్ చేసి చూస్తే.. ఈ ఏడాది అదే నెలలో వసూలైన మొత్తం 30 శాతం అధికం. కాగా- మధ్యలో జూన్ నెలను మినహాయిస్తే.. లక్ష కోట్లకు పైగా జీఎస్టీ వసూళ్లు నమోదు కావడం వరుసగా ఇది పదోసారి. గత ఏడాది అక్టోబర్ నుంచి నెలవారీ జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లకు పైగా నమోదవుతున్నాయి.
ఏపీ, తెలంగాణ వాటా ఎంత?
కాగా- ఆగస్టులో వసూలైన జీఎస్టీ కలెక్షన్లకు సంబంధించిన రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలవారీ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. గత ఏడాది ఆగస్టు నాటి కలెక్షన్ల.. ఈ ఏడాది అదే నెలలో రికార్డయిన వసూళ్ల వివరాలను ఇంందులో పొందుపరిచింది. ఏపీలో గత ఏడాది ఆగస్టులో 1,955 కోట్ల రూపాయల మేర జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. ఈ ఏడాది అదే నెలలో ఈ సంఖ్య 2,591 కోట్ల రూపాయలకు పెరిగింది. తెలంగాణలో గత ఏడాది ఆగస్టులో 2,793 కోట్ల జీఎస్టీ వసూలు కాగా.. ఈ ఏడాది అదే నెలలో 3,526 కోట్లుగా రికార్డయింది.