మొండి బకాయిలు మరింత పెరగవచ్చు, మూలధనం పెరగాలి
కరోనా మహమ్మారి నేపథ్యంలో బ్యాంకింగ్ రంగం స్థూల నిరర్థక ఆస్తులు (G-NPA), నికర నిరర్థక ఆస్తులు(NNPA) వచ్చే మార్చి నాటికి మరింత పెరగవచ్చునని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. జీఎన్పీఏలు 10.1%-10.6 శాతానికి పెరగవచ్చునని, NNPAలు 3.1%-3.2% చేరుకోవచ్చునని అంచనా వేసింది. మార్చి 2022 వరకు NNPAలు 2.4%-2.6% తగ్గవచ్చునని తెలిపింది. ఆగస్ట్ 31తో ఆర్బీఐ రుణ మారటోరియం వెసులుబాటు ముగిసింది. ఆస్తుల వర్గీకరణపై సుప్రీం కోర్టు ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి G-NPA 7.9%, NNPAలు 2.2% ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం మద్దతు
అయినప్పటికీ 2021-22లో నికర ఎన్పీఏలు, క్రెడిట్ నిబంధనలు తక్కువగా ఉంటాయని, ఎందుకంటే బ్యాంకులు తమ రుణ పోర్ట్పోలియోపై బలమైన వసూళ్లను నివేదించాయని, చాలా వరకు 90 శాతం వరకు నివేదించినట్లు తెలిపింది. రుణ పునర్నర్మాణానికి సంబంధించిన అభ్యర్థలను గతంలో వేసిన అంచనాల కంటే తక్కువగా ఉన్నట్లు తెలిపింది. కరోనా నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు పెంచేందుకు ప్రభుత్వం ప్రకటించిన అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీం ద్వారా ద్రవ్య మద్దతు లభించిందని, దీంతో కార్యకలాపాలు పెరగాయని పేర్కొంది.
అంచనా సవరణ
లోన్ రీస్ట్రక్చరింగ్ అంచనాను గతంలో 5 శాతం నుండి 8 శాతానికి వేయగా, ఇప్పుడు దానిని 2.5 శాతం నుండి 4.5 శాతానికి సవరించారు. అంచనాలకు మించి వసూళ్లు, తక్కువ లోన్ రీస్ట్రక్చరింగ్ అంచనాల నేపథ్యంలో ఎన్పీఏ 2.4 శాతం నుండి 2.6 శాతానికి తగ్గవచ్చునని, అప్పుడు అసెట్ క్వాలిటీ మరింత పెరగవచ్చునని తెలిపింది. ఇది తక్కువ క్రెడిట్ ప్రొవిజన్స్, FY22లో మంచి లాభదాయకతకు దారి తీయవచ్చునని తెలిపింది.
లాభ అవకాశాలు మెరుగు
బ్యాంకుల మూలధనం పెరిగితే లాభాలకు అవకాశాలు మెరుగు పడతాయని ఇక్రా అభిప్రాయపడింది. భారీ ప్రయివేటు రంగ బ్యాంకుల మూలధన నిల్వలు బలంగా ఉన్నాయని, అందుకే ఎలాంటి ఆటుపోట్లను అయినా అవి తట్టుకోగలుగుతున్నాయన్నారు. వచ్చే ఏడాది ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.43వేల కోట్ల వరకు అదనపు మూలధనం అవసరం అవుతుందన్నారు. తక్కువ వడ్డీరేట్లు, మెరుగైన వ్యాపార పరిస్థితులు, ఆదాయం, ఉద్యోగావకాశాలు వచ్చే ఏడాది రుణాలకు డిమాండ్ను పెంచవచ్చునని తెలిపింది.