పన్ను వేధింపులుండవు, సెటిల్మెంట్ కోసం కేంద్రం కొత్త స్కీం!
న్యూఢిల్లీ: పన్నుల వ్యవస్థను సులభతరంగా మార్చేందుకు, నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి వేధింపులు లేకుండా చేసేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. CAIT మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
జీఎస్టీ రిటర్న్స్ మరింత మెరుగ్గా మార్చే దిశగా సూచనలు స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీతారామన్ తెలిపారు. వివిధ వర్గాల నుంచి వచ్చే సూచనలకు అనుగుణంగా పన్ను వ్యవస్థను సులభంగా మార్చే చర్యలు చేపడుతున్నామన్నారు. వీటి ఆధారంగా పన్నుల వ్యవస్థలో మార్పులు చేస్తామన్నారు.
అక్కడ వర్కింగ్ హవర్స్ వారంలో 4 రోజులు, 6 గం.: 'మోడీగారూ! సనామారిన్లా చేయండి'
జవాబుదారీతనం కోసం..
గత ఏడాది అక్టోబర్ నెలలో ముఖరహిత ఎలక్ట్రానిక్ మదింపు పథకాన్ని ప్రారంభించామని నిర్మల చెప్పారు. దీంతో పన్ను చెల్లింపుదారులకు, అధికారులకు మధ్య ఎలాంటి జోక్యం అవసరం లేకుండా అరికట్టామని, పారదర్శకంగా పన్నుల మదింపు జరిగేలా చేశామన్నారు. జవాబుదారీతనం కోసం కంప్యూటర్ ఆధారిత డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
నకిలీ నోటీసుల బెడద ఉండదు
డాక్యుమెంటేషన్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ద్వారా పన్ను అధికారుల నుంచి నకిలీ నోటీసుల బెడద ఉండదని చెప్పారు. ప్రతి సమాచారానికి గుర్తింపు నెంబర్ ఉంటుందన్నారు. ఈ తరహా కేసులను 30 రోజుల్లో ముగించాల్సి ఉంటుందని తెలిపారు.
షాపింగ్ ఫెస్టివెల్స్
దేశవ్యాప్తంగా షాపింగ్ ఫెస్టివెల్స్ను నిర్వహిస్తామని సీతారామన్ చెప్పారు. దుబాయిలో నిర్వహించినట్లుగానే భారీ షాపింగ్ కార్యక్రమాలు మార్చి నుంచి ప్రారంభమవుతాయన్నారు. వాణిజ్య శాఖ దీనిపై పని చేస్తోందని చెప్పారు. వ్యాపారులు తమ సరుకులను విక్రయించుకునేందుకు పెద్ద వేదికను అందుబాటులోకి తెస్తామన్నారు.
లిటిగేషన్ సెటిల్మెంట్ స్కీం
ఇదిలా ఉండగా, బడ్జెట్లో లిటిగేషన్ సెటిల్మెంట్ స్కీం ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ స్కీం కింద పన్ను వివాదాల్లో ఉన్న కంపెనీలు రెవెన్యూ శాఖ కోరుతున్న సొమ్ములో కొంత మొత్తాన్ని చెల్లించి ఆ వివాదాలకు తెరదించుకునే అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. ఇది కంపెనీలకు, ప్రభుత్వానికి కూడా ప్రయోజనమే. కంపెనీలకు వివాదాల నుంచి బయటపడే అవకాశం రాగా, ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది.