తెలుగు రాష్ట్రాలకు ఊరట: ఏపీకి రూ.925 కోట్లు, తెలంగాణకు రూ.1,036 కోట్లు విడుదల
న్యూఢిల్లీ: రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహార నిధులు సోమవారం విడుదలయ్యాయి. రాష్ట్రాల రెవెన్యూ లోటు భర్తీకి రూ.35,298 కోట్ల మేర నిధులను మోడీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 18న జీఎస్టీ కౌన్సెల్ సమావేశం ఉంది. ఈ సమావేశానికి ముందే నిధులు విడుదల చేసింది. పలు రాష్ట్రాలకు ఆగస్ట్, సెప్టెంబర్ నుంచి జీఎస్టీ పరిహారం చెల్లింపులు జరగలేదు. దీనిపై బుధవారం జరిగే జీఎస్టీ మండలి సమావేశంలో రాష్ట్రాలు నిలదీసేందుకు సిద్ధమయ్యాయి. కానీ కేంద్రం ముందే నిధులు విడుదల చేసింది.
విశాఖపట్నంలో సరికొత్త పెట్రోల్ బంక్: స్మార్ట్ పేతో మీరే పెట్రోల్ నింపుకోవచ్చు
బహిరంగంగా కేంద్రం నిలదీత
జీఎస్టీ అమలు తర్వాత కలిగే రెవెన్యూ లోటును అయిదేళ్ల పాటు రాష్ట్రాలకు కేంద్రం భర్తీ చేయాలని జీఎస్టీ చట్టంలో ఉంది. 2017 జూలై 1వ తేదీన జీఎస్టీ అమలులోకి వచ్చింది. పరిహారం రెండు నెలల్లోపు రాష్ట్రాలకు చెల్లించాలి. కానీ గత మూడు నాలుగు నెలలుగా పరిహార నిధులు పలు రాష్ట్రాలకు అందలేదు. దీనిపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు బహిరంగంగానే కేంద్రాన్ని నిలదీశాయి. ఇప్పుడు కేంద్రం ఆ నిధులను విడుదల చేసింది.
కచ్చితంగా ఇస్తాం...
జీఎస్ట పరిహారంపై కేంద్రం మాట తప్పదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. జీఎస్టీ వసూళ్లు ఆశించిన మేర రాకపోవడంతో చెల్లింపులు ఆలస్యమవుతోందన్నారు. ఈ విషయంలో రాష్ట్రాలు అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదని, వసూళ్లను పెంచడంతో పాటు రాష్ట్రాలకు పరిహారంపై ఇచ్చిన మాట తప్పమని హామీ ఇచ్చారు. వసూళ్లు పెంచడం కోసం కలిసి పని చేద్దామన్నారు.
ఆంధ్రప్రదేశ్కు రూ.925 కోట్లు
అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.35,298 కోట్ల జీఎస్టీ నిధులు విడుదలయ్యాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన వాటా రూ.325 కోట్లు. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో ఏర్పడిన నష్టానికి పరిహారంగా ఈ మొత్తం వచ్చింది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్కు ఇది కొంత ఊరట.
తెలంగాణకు రూ.1,036 కోట్లు
జీఎస్టీ పరిహారం కింద తెలంగాణ రాష్ట్రానికి రూ.1,036 కోట్లు విడుదల చేసింది. జీఎస్టీ పరిహారంతో పాటు, ఐజీఎస్టీ బకాయిలను కూడా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి లేఖ రాసింది. తెలంగాణకు ఆగస్ట్, సెప్టెంబర్ నెలలకు కలిపి రూ.1,036 కోట్లు విడుదల చేసింది.